Revange politics : ప్రభుత్వం ఏదైనా సరే.. ఐఏఎస్ ఐపీఎస్ లు మీకు అర్థమవుతోందా!

 ఒక ఐఏఎస్ సాధించాలంటే అహోరాత్రులు శ్రమించాలి. ఐపీఎస్ గా ఎంపిక కావాలంటే కఠోర శ్రమ పడాలి. కానీ వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. రాజకీయాలకు దాసోహం అవుతోంది. తమ చేతికి మట్టి అంటకుండా రాజకీయ నేతలు అధికారుల ద్వారానే.. సాటి అధికారులపై ప్రతీకారాలు తీర్చుకోవడం పరిపాటిగా మారింది. 

Written By: Dharma, Updated On : September 1, 2024 2:08 pm

Revange politics

Follow us on

Revange politics : ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులు మారడం కామన్. తమకు నచ్చిన అధికారులను, తాము మెచ్చిన ఉద్యోగులను నియమించుకోవడం సర్వసాధారణం. అయితే అది ఇటీవల మరింత విస్తృతం అయ్యింది. నచ్చని అధికారులను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేయడం, డిజిపి ఆఫీస్ కి రిపోర్టు చేయమనడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు గిట్టని అధికారులను అప్రధాన్య పోస్టుల్లో నియమించేవారు. చూసి చూడనట్టుగా విడిచి పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ ప్రభుత్వానికి సహకరించారు.. ఆ ప్రభుత్వ పెద్దలకు వెన్నుదన్నుగా నిలిచారు.. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆదేశాలతో తమను వేధించారు అన్నది హైలెట్ అవుతోంది. అప్పటి పాలకుల ఆదేశాలు పాటించిన అధికారులు టార్గెట్ అవుతున్నారు. అప్రాధాన్య పోస్టులే కాదు.. వారు అసలు అధికారులే కాదన్నట్టు.. చిన్నపాటి ఉద్యోగులుగా కూడా చూడడం లేదు. కనీసం వారికి పోస్టింగ్ ఇవ్వడం లేదు కదా.. నేరుగా రెండు పూటలా వచ్చి సంతకాలు పెట్టమని చెబుతున్నారు. ఖాళీగా కార్యాలయంలో కూర్చోవాలని ఆదేశాలు ఇస్తున్నారు.
 * అతిగా వ్యవహారానికి మూల్యం
 గడిచిన ఐదేళ్ల కాలంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతిగా వ్యవహరించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటిస్తూ ప్రత్యర్థులను వేధించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అలా వేధించిన అధికారులను వెంటాడడం ప్రారంభించారు. 19 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగులు ఇవ్వలేదు. అయితే ప్రతిరోజు వారు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిపి కార్యాలయంలో కూర్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇలా ఆదేశాలు ఇచ్చిన డిజిపి కూడా ఒక అధికారి కావడం విశేషం.
 * అది కామన్ పాయింట్
 అయితే ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం అనేది కామన్. కానీ అంతకుమించి ఇప్పుడు అధికారులు వేధింపులకు గురవుతున్నారు. ఇలా వేధిస్తున్నది కూడా అధికారులే. ప్రభుత్వ పెద్దలు చెప్పారనో, ప్రమోషన్ల కోసమనో వారి ఆదేశాలు పాటిస్తే మూల్యం చెల్లించుకునేది కూడా అధికారులే. అందుకే ప్రభుత్వాల ఆదేశాల కంటే తమ మనస్సాక్షిని అధికారులు నమ్ముకోవడం ముఖ్యం. ప్రాథమిక స్థాయి నుంచి చదువులో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటారు. కానీ రాజకీయ నేతలు చేసిన తప్పిదాలకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని అధికారులు గ్రహించుకోవాలి.
 * అలా దాసోహం  
 ప్రభుత్వాల పదవీకాలం ఐదేళ్లు.  కానీ ప్రభుత్వ అధికారుల సర్వీస్ 60 ఏళ్లు. కానీ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటున్న నేతల ఆదేశాలను పాటించి.. 60 ఏళ్ల సర్వీస్ ఉన్న అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నారు. జైలుకు వెళ్తున్నారు. నేతలు జైలుకు వెళ్లి పదవులు తెచ్చుకుంటున్నారు. కానీ అధికారులు జైలుకు వెళ్లి అవినీతి మరకను, అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. అందుకే అధికారుల్లోమార్పు రావాలి. వారు సంఘటితం కావాలి. వారిలో చైతన్యం రావాలి. అప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుంది. లేకుంటే అపఖ్యాతి మూటగట్టుకోవడం ఖాయం.