Visakhapatnam Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు? ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందా? ఈ విషయాన్ని పవన్ కు కార్మికులే చెప్పారా? స్టీల్ ప్లాంట్ సేఫ్టీ ఆడిట్ సరిగ్గా లేదా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ ఎక్కడా జరగని విధంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే వరుసగా ప్రమాదాలు జరగడంపై అనుమానం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. బొకారో స్టీల్ ప్లాంట్ అధికారులను సైతం విచారణ కమిటీలో నియమించారు.
* మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే స్టీల్ ప్లాంట్. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్న అనుమానం కూటమి నేతల్లో ఉంది. ముఖ్యంగా కార్మిక సంఘాల నేతల ముసుగులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇతర వామపక్షాల ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై 360 డిగ్రీల కోణంలో దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయట పడుతుందని చెప్పారు. 33 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఘటన జరగలేదని.. అందుకే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
* కూటమి అండగా నిలిచినా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రతిపాదన రాగా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పట్లో జగన్ సర్కార్ అనుకున్న స్థాయిలో వ్యవహరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అంశానికి ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వచ్చింది. పైగా స్టీల్ ప్లాంట్ కు 13 వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ కూడా వచ్చింది. అయినా సరే కూటమి పై కార్మిక వర్గాల్లో అసంతృప్తికి రావడానికి ప్రధాన కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది వామపక్షాల నేతలతో వైసిపి కుమ్మక్కై.. లేనిపోని రాజకీయ డ్రామాలు ఆడుతోందని కూటమి అనుమానిస్తూ వస్తోంది. నిన్న కూడా బాధ్యతగా వ్యవహరించి బాధితులను పరామర్శిస్తే.. సాక్షి మీడియా నినాదాలు చేయమని పురమాయించడం.. వామపక్షాల నేతలు నిలదీసినంత ప్రయత్నం చేయడం వంటి వాటిని కూటమి సీరియస్ గా తీసుకుంటుంది. ప్లాంట్ లో భద్రతా చర్యలు కొరవడితే కార్మిక సంఘాల ముసుగులో వామపక్షాల నేతలు ఉన్నారని.. వారెందుకు ముందుగా ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కుట్ర కోణం ఉందని ఆరోపించడం మాత్రం సంచలనంగా మారింది. మరి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందం ఏం తెలుస్తుందో చూడాలి.

