Nara Lokesh : విశాఖ బాధ్యతలు లోకేష్ కు?

Nara Lokesh శాసనసభ సమావేశాల అనంతరం ఇన్చార్జి మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లా ఇన్చార్జిగా లోకేష్ పేరు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 18, 2024 11:12 am

Minister Nara Lokesh

Follow us on

Nara Lokesh : ఏపీలో ఇప్పుడు విశాఖ హాట్ టాపిక్. రుషికొండ భవనాలు, అత్యంత ఖరీదైన నిర్మాణాలు రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీశాయి. వైసిపి మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖను రాజధానిగా చేసేది. రుషికొండ ప్యాలెస్ నుంచి పాలన సాగేది. కానీ టిడిపి కోటమే అధికారంలోకి రావడంతో సీన్ మారింది. అయితే రుషికొండ సేవలను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. కానీ అంతకంటే ముందే విశాఖ నగరాన్ని గాడిలో పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఐటీ హబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వీలైనంతవరకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలనుకుంటున్నారు. అదే సమయంలో ఏమాత్రం వైసిపికి ఇక్కడ చాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే లోకేష్ ను విశాఖపై ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పెద్ద నగరం. అభివృద్ధి చెందిన నగరం. ఇంకా చేయడానికి అవకాశం ఉన్న నగరం. అందుకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి.. అదే సమయంలో విశాఖను మరింత అభివృద్ధి చేసి.. దేశంలోనే పేరు మోసిన నగరాల జాబితాలో చేర్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ విశాఖలో పాలన జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటి హబ్ గా మార్చేందుకు లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో బాధ్యతలను లోకేష్ కు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ ఇన్చార్జ్ మంత్రిగా ఉండటంతో పాటు మూడు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను కూడా లోకేష్ తీసుకుంటారని తెలుస్తోంది. 2014 వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీకి చిక్కడం లేదు. అందుకే దానిని కొనసాగించాలని లోకేష్ శతవిధాలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో వైసిపి రూపు రేఖలు లేకుండా చేయాలన్నది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. అందుకే ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ద్వారా ఈ తతంగం జరుపుతారని సమాచారం. శాసనసభ సమావేశాల అనంతరం ఇన్చార్జి మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లా ఇన్చార్జిగా లోకేష్ పేరు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.