Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు( Visakha steel plant ) కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి భారీగా నగదు సాయం అందించాలని భావిస్తోంది. కొత్తగా రూ.8097 కోట్ల రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫైల్ క్లియర్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ అందించింది. తాజాగా ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు అందించనుండడంతో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక గాడిన పడుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి రూ.8097 కోట్లకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.
* ప్రైవేటీకరణ వివాదం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూనే ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు అందిస్తూ వచ్చింది. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తుండగా.. కేంద్ర మంత్రులు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతూ వచ్చారు. అయితే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల కోట్ల రూపాయల సాయం అందజేసింది. అయితే స్టీల్ ప్లాంట్ కు కావాల్సింది నగదు సాయం కాదని.. సొంత గనులు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరుతూ వచ్చాయి. ప్రస్తుతం ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభంతో కార్యకలాపాలు ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. స్టీల్ ఉత్పత్తి తో పాటు అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ కార్యకలాపాలు ఇలాగే భవిష్యత్తులో సుదీర్ఘంగా కొనసాగేందుకు అవసరమైన చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు రెండో దశ ప్యాకేజీ లో భాగంగా ఎనిమిది వేల కోట్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
* రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులతో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గుదిబండగా మారింది. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. గత ఏడాది తొలివిడతగా రూ.11440 కోట్ల ప్యాకేజీ అందించింది. ఈక్విటీ రూపంలో రూ.10,300 కోట్లు.. వర్కింగ్ క్యాపిటల్ రుణాలను ఏడు శాతం నాన్ క్యూములేటివ్ రీడిమాబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో 1140 కోట్లను సమకూర్చింది. ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలు సమకూర్చాలని నిర్ణయించడం విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించే వరకు.. పరిస్థితి ఇలానే కొనసాగనుంది. అందుకే నగదు సాయానికి బదులు.. సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.