Vijayasai Reddy : ఇటీవల విజయసాయిరెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో హడావుడి చేస్తున్నారు. ఈ మధ్యనే సాయన్న ముసలోడైపోయాడంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాయన్న స్థానంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీసుకుంటున్నట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి విజయసాయి కేంద్ర కార్యాలయానికి వచ్చి రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నారు. దీంతో తాడేపల్లి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వద్ద ఎటువంటి పదవి లేదు. తొలుత ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఉండేవారు. తరువాత సోషల్ మీడియా ఇన్ చార్జి, అటు తరువాత పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలు విజయసాయి వద్ద ఉండేవి. వాటన్నింటినీ జగన్ కత్తిరించారు.
ఇప్పుడు విజయసాయి వద్ద ఎటువంటి పదవులు లేవు. ఒక్క రాజ్యసభ సభ్యత్వం తప్పించి.. ఇటీవల వైసీపీ వర్క్ షాపులో సైతం విజయసాయి విషయంలో జగన్ స్పష్టతనిచ్చారు. కానీ విజయసాయి మాత్రం కొంచెం అతిగానే స్పందిస్తున్నారు. కొద్ది నెలల పాటు మౌనాన్ని వీడి సోషల్ మీడియాలో యాక్టివ్ ట్విట్లు పెడుతున్నారు. కానీ మునుపటిలా అవి పేలడం లేదు. వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు తనకు అప్పగించినట్టు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. కొందర్ని తొలగించి కొత్తవారిని నియమిస్తున్నారు.
సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో విశాలమైన గదిని అప్పగించారు. నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశారు. కార్యాలయంలో ఓ ఇరుకు గదికి పరిమితం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మేనేజర్ కు సైతం స్థానచలనం కల్పించారు. అయితే ఈ మార్పులన్నీ విజయసాయిరెడ్డి చేసినట్టు తెలుస్తోంది. అనుబంధ విభాగాల ఇన్ చార్జి హోదాలోనే ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే జగన్ మాత్రం ఇక నుంచి ఈ బాధ్యతలన్నీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చూస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ జరుగుతోంది విరుద్ధం. ఏకంగా విజయసాయిరెడ్డి వచ్చి తన మనుషులతో కార్యాలయాన్ని నింపేస్తుండడం విశేషం. కాగల పరిణామాలను ఊహించే విజయసాయిరెడ్డి ఇలా చేస్తున్నారో.. లేకుంటే హైకమాండ్ ఆదేశాల మేరకు చేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.