Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నమ్మకస్తులైన నేతల అవసరం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటకు వచ్చాయి. తన తెర వెనుక అవినీతి జరిగి ఉంటుంది కానీ… ఎంత స్థాయిలో ఉంటుందా అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డిలో కలిగిందట. అందుకే తన చుట్టూ ఉన్న టీం పై ఆయన పూర్తి అసహనంతో ఉన్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఏపీలో మద్యం కుంభకోణంలో అసలు గుట్టును బయటపెట్టారు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడిన తరువాతనే ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కీలక నిందితులు తెరపైకి వచ్చారు.. ఇలా సిట్ తో పాటు ఈడి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది. తన చుట్టూ తనకు తెలియకుండా ఇంత జరిగిందా అన్న అనుమానాలు ఆయనలో ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాలనే విజయసాయిరెడ్డి మద్యం గుట్టును విప్పినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతర్గత వ్యవహారాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. విజయసాయి రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా కనిపిస్తోంది.
* నత్వాని గెలుపులో కీలక పాత్ర..
తాజాగా జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం జార్ఖండ్ నుంచి పరిమల్ నత్వాని అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడమే. బిజెపి అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు నత్వాని. కాంగ్రెస్ అభ్యర్థి పై అద్భుత విజయం సాధించారు. నత్వానికి వైసీపీ గతసారి ఛాన్స్ ఇచ్చింది బిజెపి కోటాలో. కానీ ఈసారి ఆ సమీకరణలు కలిసి రాక తన పాత ఝార్ఖండ్ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. దీని వెనుక ఉన్నది మాత్రం విజయసాయిరెడ్డి అని ఇప్పుడు తెలుస్తుండడం విశేషం. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి విజయసాయిరెడ్డి రాంచీ వేదికగా తెరవెనుక చక్రం తిప్పారు. బిజెపికి 24 మంది సభ్యులు ఉండగా మరో నలుగురు కాంగ్రెస్ సభ్యులను బిజెపి వైపు టర్న్ చేయడంలో విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం వహించారన్నది ఇప్పుడు ప్రధాన వార్త. సంక్లిష్టమైన రిసార్ట్ రాజకీయాలు నడిపి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు విజయసాయిరెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఈ తరహా రాజకీయాలు అందించి ఎంతగానో ప్రయోజనం చేకూర్చారు. అటువంటి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు. ఇప్పుడు చుట్టూ ఉన్న కోటరితో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే తన లోటును తెలియజెప్పేందుకే విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి.
* కోటరీని పక్కనపెట్టి..
ప్రస్తుతం ఏపీలో తనను గట్టెక్కే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తనను పిలవాల్సిన అనివార్య పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు విజయ్ సాయి రెడ్డి. ఇప్పుడు తాజా పరిణామాలు నేపథ్యంలో జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతుండడంతో ఆయనను జగన్ పిలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి గురించి పార్టీలోనే వ్యతిరేకత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టం అధికం. అందుకే ఆ భజన బృందాన్ని పక్కనపెట్టి.. విజయసాయిరెడ్డి లాంటి వారిని మళ్లీ తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది. నత్వాని లాంటి కార్పొరేట్ శక్తులనే గెలిపించుకున్న చరిత్ర ఇప్పుడు విజయసాయిరెడ్డి సొంతమయ్యింది. మరి జగన్ మోహన్ రెడ్డి పిలుస్తారా లేదా అన్నది చూడాలి.
