Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం లేదు. వై వి సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. పొలిటికల్ కన్సల్టెంట్లు, మధ్యవర్తుల సాయంతో ఢిల్లీ లాబీయింగ్ నడుపుతున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నారు.
* ఢిల్లీకి దగ్గరగా వైసిపి..
ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కీలకం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధిగా మారింది. అలా కాంగ్రెస్కు విరోధి అయిన బిజెపి వైసీపీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే దానికి మూల కారకుడు మాత్రం విజయసాయిరెడ్డి. ఢిల్లీ నెట్వర్కింగ్ లో విజయసాయి రెడ్డికి ప్రత్యేకమైన శైలి ఉండేది. పొలిటికల్ అప్రోచ్ సాధించడంలో ఆయన అంది వేసిన చెయ్యి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయాలతో నేరుగా నిరంతరం టచ్ లో ఉంటూ.. జగన్ కోరిన మరుక్షణం వారి అపాయింట్మెంట్ ఇప్పించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. వైవి సుబ్బారెడ్డి చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఫెయిలవుతుండడంతో జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నారు.
* అప్పట్లో చాలా సులువుగా..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరింది. ఆ సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లభించేది. దానికి ముమ్మాటికి కారణం విజయసాయిరెడ్డి. ఆయన వ్యక్తిగతంగా నెట్వర్క్ పెంచుకోవడంతో పాటు రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు లాబీయింగ్ నడపగలరు. విజయసాయిరెడ్డి ఇప్పుడు లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి లోటు. గత కొన్ని నెలలుగా ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ అవి ఫలించలేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే మళ్ళీ విజయసాయిరెడ్డిని దగ్గరకు చేర్చుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అని తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో రోజురోజుకు చంద్రబాబు కీలకంగా మారిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఢిల్లీ తలుపులు మరింత సవాలుగా మారుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బలమైన వ్యూహాలు అమలు చేయగల సమర్థత ఉన్న విజయసాయిరెడ్డి అవసరం ఇప్పుడు జగన్ కు ఉంది.

