TDP Mahanadu 2026 North Andhra: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) మహా పండుగకు సమయం ఆసన్నం అవుతోంది. ఏటా మే నెలలో మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చిరస్మరణీయమైన విజయం అందించిన రాయలసీమ.. అందున కడపలో మహానాడు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం టిడిపికి కంచుకోటగా భావించి ఉత్తరాంధ్రలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనువైన ప్రాంతాల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం పరిశీలనలు చేస్తోంది. 9 ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సమాచారం.
* ఆవిర్భావము నుంచి పండుగ మాదిరిగా..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అంటే ఒక పండుగ తరహాలో జరిపిస్తూ వస్తోంది. కేవలం సభ నిర్వహణ కాకుండా.. లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు రవాణా, భద్రత, పార్కింగ్ వంటి మౌలిక వసతులపై ముందే కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడు ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం ఒక సంప్రదాయం. పార్టీ ఆశయాలతో పాటు ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా టిడిపి శ్రేణులకు దిశ నిర్దేశం చేయడం మహానాడు ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలు మొదటి రెండు రోజులు పార్టీ అంతర్గత సమావేశాలు, రాజకీయ తీర్మానాలు ఉంటాయి. చివరి రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
* గత ఏడాది కడపలో..
గత ఏడాది కడపలో ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కడప ను ఎంపిక చేశారు. ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న మహానాడు కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తు అనుకూలత నుంచి రవాణా సౌకర్యాల వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి వేదిక ఖరారు చేయనున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో టిడిపి నేతల బృందం పలు ప్రాంతాలను పరిశీలించింది. జాతీయ రహదారి చెంతనే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే టిడిపి శ్రేణులకు అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో పడింది ఈ బృందం. ఒకటి రెండు రోజుల్లో దీనిని ఫైనల్ చేసి మహానాడు సన్నాహక పనులు మొదలు పెడతారని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహణకు సంబంధించి ఎంపిక వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉంది. రైల్వే జోన్ సాకారం కావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ కావడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు వచ్చాయి. కూటమి పట్ల ఉత్తరాంధ్రలో ఎంతో సానుకూలత ఉంది. అందుకే ఇక్కడ మహానాడు జరిపితే తప్పకుండా మైలేజీ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, కూటమి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇదో మంచి అవకాశం కూడా..