Undavalli Arun Kumar: మార్గదర్శి పై మళ్లీ పోరాటం ప్రారంభించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అటు సూర్యుడు సాయంత్రానికి అలసిపోయి.. పడమటన ఉదయిస్తాడు కానీ.. మార్గదర్శిపై తన పోరాటం ఆగదని ఉండవల్లి చాటి చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ.. ఈ కేసు కొలిక్కి రావడం లేదు. గత ఏడాది ఆగస్టులో తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. దానిని సవాల్ చేస్తూ ఇప్పుడు ఉండవల్లి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో విశేషం ఏమిటంటే.. తాము మార్గదర్శి ద్వారా నష్టపోయాం అని ఏ ఒక్కరూ చెప్పకపోవడం. మార్గదర్శి కూడా తన ఖాతాదారులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు కూడా చేసేసింది. ఎవరైనా మిగిలి ఉంటే వస్తే ఇస్తామని కూడా సూచించింది. అందుకే కోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది. కానీ మార్గదర్శిని విడిచి పెట్టే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.
* దశాబ్దాలుగా పోరాటం..
ఎవరికైనా అన్యాయం జరిగితేనే.. లేకుంటే ఏదైనా నష్టపరిహారం కోసమో.. లేకుంటే న్యాయం కోసం.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణం. కానీ 2004లో ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్ పై న్యాయపోరాటం ప్రారంభించారు. ఖాతాదారులకు అన్యాయం చేశారు అంటూ రామోజీరావు పై పెద్ద ఉద్యమమే చేశారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో ఇట్టే పసిగట్టవచ్చు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఈనాడు ఉంది కాబట్టి.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీ మార్గదర్శిపై పోరాడుతూనే ఉన్నారు.
* పిటిషన్ల మీద పిటిషన్లు..
అయితే ఈ కేసులో దురదృష్టం ఏమిటంటే.. కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు కొనసాగుతున్నాయి. న్యాయస్థానాలు మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తోంది. ఖాతాదారుల లావాదేవీలు, డిపాజిట్లు, చెల్లింపులు ఇలా అన్ని వివరాలు తీసుకుంటోంది. అంతా సవ్యంగా ఉన్నాయి కదా ఇంకేంటి అభ్యంతరాలు అంటూ కొట్టేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో రామోజీరావు మరణించిన తర్వాత ఈ కేసు విచారణ అవసరం లేదని చెప్పి తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. అప్పట్లో ఎవరికైనా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఖాతాదారులకు చెల్లింపులు చేయకపోతే ఆశ్రయించాలంటూ పత్రిక ప్రకటనలు కూడా ఇచ్చింది. కానీ ఏ ఒక్క ఖాతాదారుడు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఏం చేయాలో తెలియక కోర్టు కొట్టి వేసింది. అయినా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శి విషయాల్లో తగ్గేదిలే అంటూ ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అందుకే ఇప్పుడు రామోజీరావు వారసులు నోటీసులు అందుకున్నారు. సమాజంలో చాలా రకాల కేసులు నడుస్తున్నాయి. అంతెందుకు అక్రమస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన బెయిల్ పై ఉన్నారు. అటువంటి వారి జీవితంలో పరిణామాలను విశ్లేషించే ఉండవల్లి అరుణ్ కుమార్.. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో మాత్రం మొండి పట్టుదలగా ఉన్నారు. అందులో రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏ ఒక్కరూ తమకు నష్టం జరిగిందని ముందుకు రాలేని కేసులో కూడా.. ఉండవల్లి ఉడుం పట్టులా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.