Tuni Child Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులు దాటుతున్న ఎటువంటి క్లూ లభించడం లేదు. ఆ చిన్నారి కోసం వందలాది మంది పోలీసులు గట్టిగానే గాలిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయినా సరే ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ.. రోజుకో కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే చివరకు పూర్తి కిడ్నాప్ కోణంలోని ఈ ఘటన జరిగినట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పెంపుడు కుక్కకు జిపిఆర్ఎస్ అమర్చి వెతుకులాట ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు కుటుంబ కలహాల అనుమానాల నేపథ్యంలో తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఏది కూడా కొలిక్కి రావడం లేదు. చిన్నారి ఆచూకీ దొరకడం లేదు.
* తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో…
చిన్నారి తల్లి భవాని ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ జరిగిందని ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని ఆయన పేర్కొన్నారు. అక్కడ కొద్ది రోజులకే మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని ఆమె తెలిపారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాధారణంగా ఎంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారితోనే వెళ్తారు. అందుకే ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక తెలిసిన వారి పని అయి ఉంటుందన్న పోలీస్ అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల కాల్ డేటా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.
* దొరకని ఆనవాళ్లు..
పాప అదృశ్యమైన మొదటి రెండు నుంచి మూడు గంటల సమయాన్ని పోలీసులు గట్టిగా గమనిస్తున్నారు. గ్రామంలో సిసి పుటేజీలు పరిశీలిస్తున్నారు. కానీ ఎక్కడ చిన్నారి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడైనా దాచారా? లేకుంటే గ్రామాన్ని దాటించేసారా అనే కోలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీయడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
* తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు..
మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఆ కుక్క కళ్ళలో భయం కనిపించింది. కానీ పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారిని చూసి కొంత భయపడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకుల సహాయంతో చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో, రౌద్రంగా కనిపిస్తోంది ఆ కుక్క. అయితే ఆ కుక్కకు జిపిఎస్ పరికరాన్ని అమర్చి పోలీసులు మళ్లీ అడవిలోకి ఆ కుక్కను వదిలారు. అయితే కొంత దూరం వెళ్లిన ఆ కుక్క తిరిగి మళ్ళీ చిన్నారి ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయింది. దీంతో పోలీసులు రూటు మార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా ఘటన జరిగి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారం రోజులు దాటుతున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

