AP Rajya Sabha Members: ఏపీలో ( Andhra Pradesh)కాపు అంశం అనేది ఇప్పుడు కాక రేపుతోంది. అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో కాపు ఆ విషయాన్ని తెరపైకి తెచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాపు ఐకానిక్ లీడర్లుగా అంబటి రాంబాబు తో పాటు పేర్ని నానిని ప్రమోట్ చేసే పనిలో ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని ఒక పావుగా వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగారు జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కాపులకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు అన్యాయం చేస్తుంటే నోరు తెరవని వారు.. ఇప్పుడు ఎలా తీరుస్తున్నారు అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపుల అంశాన్ని తెరపైకి తెచ్చిన క్రమంలో.. టిడిపి కూటమి ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవులను కాపులకు ఇచ్చి గట్టి సమాధానం చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం.
* నాలుగు పదవులు ఖాళీ..
ఈ ఏడాది జూన్లో ఏపీలో నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. అందులో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన ముగ్గురు పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో టిడిపికి చెందిన సానా సతీష్ సైతం పదవీ విరమణ చేస్తారు. అయితే గతంలో వైసీపీ హయాంలో బిజెపి కోటా కింద పారిశ్రామిక వర్గాలకు చెందిన పరిమల్ నత్వాని సైతం రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన సైతం పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ నాలుగు పదవులు సైతం కూటమికి దక్కనున్నాయి. అయితే టిడిపికి చెందిన సతీష్ కు మరోసారి ఛాన్స్ వస్తుంది. మిగిలిన మూడు రాజ్యసభ పదవులను మూడు పార్టీలు సమానంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు జనసేనకు రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. కూటమి వచ్చిన తర్వాత నాలుగు రాజ్యసభ పదవులకు గాను అటు బిజెపి రెండు, ఇటు టిడిపి రెండు తీసుకున్నాయి. అయితే ఈసారి టిడిపి మూడు పదవులు, జనసేనకు ఒక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని కేంద్ర పెద్దలతో చర్చించి వారి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే ఏపీలో రాజ్యసభ పదవులు కాపులకు ఇచ్చి వైసీపీకి చెక్ చెప్పాలని చూస్తున్నారు బాబు.
* ఎంతోమంది ఆశావహులు..
టిడిపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం టికెట్ వదులుకున్నారు వర్మ( Pithapuram Varma ). అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు రాజ్యసభకు పంపించి సరైన గౌరవం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు సైతం రాజ్యసభ పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వంగవీటి మోహన్ రంగా తో అంబటి రాంబాబును పోల్చడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. వంగవీటి అభిమానులు సైతం దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో వంగవీటి రాధాకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా.. గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేనకు ఇచ్చే రాజ్యసభ సీటును సైతం కాపులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక కాపు నాయకుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుకు సైతం సన్నిహితుడుగా తెలుస్తోంది. దీనిపైనే ఈరోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని.. ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.