Jogi Ramesh House: అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మర్చిపోకముందే.. ఏపీలో మరో సంఘటన చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో ఇన్ని రోజులపాటు జైలు జీవితాన్ని గడిపిన వైసిపి నాయకుడు జోగి రమేష్.. జైలు నుంచి విడుదలైన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టిడిపి నాయకులు రెచ్చిపోయారు. కొందరు వ్యక్తులు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. భారీగా టిడిపి నాయకులు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇబ్రహీంపట్నం, మైలవరం, విజయవాడ పశ్చిమం, జి. కొండూరు ప్రాంతాలకు చెందిన టిడిపి కార్యకర్తలు భారీగా వచ్చారు. టిడిపి కార్యకర్తలు వస్తున్న విషయం తెలుసుకున్న రమేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. టిడిపి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో జోగి రమేష్ తండ్రి మోహన్ రావు, రమేష్ సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ అక్కడే ఉన్నారు.
జోగి రమేష్ ఇంటి మీదికి టిడిపి కార్యకర్తలు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో పరిస్థితి దారుణంగా మారుతోందని భావించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు.
జోగి రమేష్ ఏమన్నారంటే
“టిడిపి కల్తీ అయిపోయింది. నేతలు కల్తీ మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ కు మెదడు దెబ్బతిన్నది. ఆయన బుద్ధి తక్కువ రాజకీయాలు చేస్తున్నారు. ఆ తరహా రాజకీయాలను ఆయన మానుకోవాలి. రాష్ట్రాన్ని ఏడాదిన్నర కాలంలో నాశనం చేశారు. తిరుపతి స్వామి వారి ప్రసాదంలో కల్తీ చేసారని ప్రచారం మొదలుపెట్టారు. అలాంటిది ఏమీ లేదని చిట్ ప్రకటించింది. టిడిపి నాయకులు ఇప్పటికైనా మంచిగా ప్రవర్తించాలి. వారికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఇలా జరగాలని దేవుడికి పూజలు చేశానని” జోగి రమేష్ పేర్కొన్నారు. అంతేకాదు నారా లోకేష్ ను ఉద్దేశించి రాయకూడని భాషలో బూతులు తిట్టారు.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయంలో జోగి రమేష్ పూజలు చేశారు. ఆ తర్వాత విలేకరుల ఎదుట ఈ మాటలు మాట్లాడారు. కల్తి మద్యం కేసు పెట్టావు. పరకామణి వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చావ్. నామీద లేనిపోని అభియోగాలు మోపి జైలు పాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ రాక్షసానందం పొందారని” జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఈ మాటలే టిడిపి శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. అందువల్లేవారు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు.