TDP Vs YSRCP: రాజకీయాలు చేయడం అనేది ప్రతి పార్టీకి ముఖ్యం. సిద్ధాంతాలు వేరు కానీ అన్ని పార్టీల సారం ఒక్కటే. ప్రజా సంక్షేమమే ప్రతి పార్టీ లక్ష్యం. కానీ వెళ్లే దారులే వేరు. అయితే అధికారపక్షంలో ఉంటే దానిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు వడ్డాలి. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రయత్నం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అతివిశ్వాసం ప్రదర్శించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే భ్రమల్లో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి చిన్న అంశం పై కూడా పోరాటం చేసింది. ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చాక కూడా ప్రజలు దూరం కాకుండా సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూస్తూ ముందుకు సాగుతోంది.
* ప్రతిపక్ష ఉనికి చాటుకోలేక..
ప్రతిపక్షం ఎలా ఉండాలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదు. 2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. కానీ అప్పట్లో ఆ పార్టీది ఫ్రెష్ లుక్. ఏం చెప్పినా ప్రజలు నమ్మేవారు. ఆపై రాజకీయ వ్యూహాలు కూడా పనిచేసేవి. ఇప్పుడు మాత్రం అలా కుదరదు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీగా వైసిపి వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే కొత్తగా ఆలోచించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. ఆ పార్టీ పడిపోయిన ప్రతిసారి పైకి లేచింది. అయితే ఆ లేచిన తీరు వెనుక చాలా శ్రమ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది కనిపించడం లేదు.
* పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి..
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా రాలేదు. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అటు తరువాత వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఎక్కడ కృంగిపోలేదు పార్టీ అధినేత చంద్రబాబు. ఓడిపోయిన కొద్ది రోజులకే చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. నిండు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తున్న లెక్క చేయలేదు. ఎక్కడెక్కడో ఉన్న టిడిపి శ్రేణులను బయటకు తెచ్చి పోరాట బాట పట్టారు.
* వైసీపీ శ్రేణులు యాక్టివ్ అయినా..
2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ ఘోర ఓటమి నుంచి తేరుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ శ్రేణులు యాక్టివ్ గా ముందుకు వస్తున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు మాత్రం ముందుకు రాని పరిస్థితి. అప్పట్లో టిడిపిలో అది రివర్స్. ఎక్కడెక్కడో మూలన దాగివున్న టిడిపి శ్రేణులను పోరాట బాట పట్టించారు చంద్రబాబు. ఇప్పుడు పోరాడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి కానీ.. నడిపించే నేతలు లేకుండా పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్షం ఎలా ఉండాలో.. ప్రతిపక్షం ఎలాంటి పోరాటాలు చేయాలో.. టిడిపిని గమనిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టాలెక్కినట్టే…