Nara Lokesh: తెలుగుదేశం ఎన్డీఏ కు దూరం కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని చూసిందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిశారా? ఇదే రూమర్ గతంలో వెలుగు చూసింది. నిన్నను కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా కాంక్లేవుకు హాజరయ్యారు. అక్కడే ఈ రూమర్ ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు అటువంటి ప్రయత్నం జరిగిందా అని జర్నలిస్ట్ ప్రశ్నించేసరికి.. లోకేష్ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అసలేం జరిగింది? దాన్ని తెర వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది వివరించారు లోకేష్. ఆ వెంటనే తాను ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు.
* గత పరిణామాల దృష్ట్యా..
గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. నాడు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అయితే విభజన హామీలకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసేసరికి ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. అలా ఎన్డీఏ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారు. జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా రాజకీయంగా 2019 ఎన్నికల్లో నష్టపోయారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలంగానే బిజెపితో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ పుణ్యమా అని మళ్లీ అంతా కలిశారు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం సైతం రాజకీయంగా, రాష్ట్ర ప్రయోజనాలపరంగా పెద్దపీట వేస్తోంది ఏపీకి. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు మొన్న ఆ మధ్యన ప్రచారం నడిచింది.
* ఆయన రాజీనామాతో..
మొన్న మధ్యన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి చేసి రాజీనామా చేయించందన్నది ఒక విమర్శ. జగదీప్ బిజెపి వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ దేశానికి. కానీ బిజెపి ఆదేశాలు కాకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్లారు. ఇది ఎంత మాత్రం కేంద్ర పెద్దలకు రచించలేదు. అందుకే ఆయన పై ఒత్తిడి చేయించి రాజీనామా చేయించినట్లు వార్తలు వచ్చాయి. అలా రాజీనామా చేసిన జగదీప్ ను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా టాక్ నడిచింది.
* ప్రధానికి వివరణ..
అయితే టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ.. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు. ముంబైలో మాజీ ఉపరాష్ట్రపతిని కలిసింది నిజమేనని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఒప్పుకున్నారు. అది రాజకీయ భేటీ కాదని.. యాదృచ్ఛిక సమావేశం అని చెప్పుకొచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అయితే లోకేష్ వివరణ ఇచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోడీ నవ్వేశారట. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ గ్యాప్ వస్తుందన్న ఆందోళన లోకేష్ లో ఉంటే… ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఉంటుందని.. అందులో ఎంత మాత్రం తప్పు లేదని.. తాము సైతం క్రాస్ చెక్ చేసామని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఊపిరి పీల్చుకున్నారు లోకేష్. నిన్న కాంక్లేవ్ లో అదే విషయాన్ని చెప్పారు మంత్రి నారా లోకేష్.
