TDP ministers strategic attack: తెలుగుదేశం పార్టీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు అటాక్ అనేది ఆ పార్టీ స్ట్రాటజీ కాదు. రాజకీయ విమర్శలు వస్తే దానికి ధీటైన కౌంటర్ ఇవ్వడమే ఆ పార్టీ నేతలు చేసే పని. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే మాత్రం ముందే టిడిపి మంత్రులు అటాక్ చేయడం చూస్తుంటే మాత్రం ప్రత్యేక వ్యూహం ఉన్నట్టు అర్థమవుతుంది. జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన తర్వాత రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో మంత్రి కింజరాపు అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సెగలు పుట్టించాయి. అయితే ఆయన ఒక్కడే కాదు. ఆ తరువాత మంత్రి పయ్యావుల కేశవ్. అటు తరువాత మంత్రి వంగలపూడి అనిత, చివరకు నిమ్మల రామానాయుడు.. ఇలా అంతా వరుసగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా టిడిపి మంత్రులు ఈ తరహా అటాక్ చేయడం వైసీపీకి నిద్ర పట్టడం లేదు.
వైసీపీకి విరుద్ధంగా..
సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా కౌంటర్ అటాక్ ఉంటుంది. దీనిపైనైనా మూకుమ్మడి దాడి ఆ పార్టీ పుణ్యమే. అది వారికి అలవాటైన విద్య కూడా. కానీ టిడిపి మాత్రం అలాంటి విమర్శలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పడమే. అదేపనిగా దానిని లాగి బయటకు ప్రచారం చేయడం ఉండదు. కానీ ఫస్ట్ టైం టిడిపి మంత్రులు అటాక్ చేయడం ప్రారంభించారు. తండ్రి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఆరాటపడ్డారు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఏవిధంగా మాట్లాడారు అన్న విషయాలను గుర్తు చేస్తూ అచ్చెనాయుడు చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. తరువాత అదే స్థాయిలో మాట్లాడారు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత. చివరకు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా హత్య గురించి ప్రస్తావిస్తూ వైసిపి పై విమర్శలు చేశారు.
మావిగన్ పై ప్రచారం లేకుండా..
అయితే ఈ మొత్తం పరిణామాలతో మావిగన్ రాజధాని ప్రతిపాదన హైలెట్ అయింది. దానికి వ్యతిరేక ప్రచారం తోడైంది. వాస్తవానికి మావిగన్ పై వచ్చిన వ్యతిరేకతను.. అనుకూలంగా మార్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మూడు నెలల పాటు దానికి టార్గెట్ పెట్టుకుంది. అదే పనిగా మావిగన్ ప్రచారం చేస్తే ప్రజల్లో క్రమేపి సానుకూలత వస్తుందని అంచనా వేసింది. కానీ ఈ విషయాన్ని గుర్తించిన టిడిపి మంత్రుల ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. అలా ఆ కౌంటర్ పతాక స్థాయికి తీసుకెళ్లింది. మావిగన్ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామనుకున్న వైసీపీ ఆశలను గండి కొట్టింది. పక్కా వ్యూహంతోనే టిడిపి మంత్రుల కౌంటర్ అటాక్ అని అర్థమైంది.
