Chandrababu: తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. పార్టీ కోసం ప్రచారం చేసిన వారు ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు. అటువంటి వారికి ఎలా న్యాయం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఏ పదవులు ఇప్పుడు వస్తున్నా అందులో రెండు మిత్ర పక్షాలకు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. తాజాగా ఓ నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయితే.. అందులో మూడు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఒక పదవిని జనసేన కు కేటాయించింది. గతంలో ఓ నాలుగు రాజ్యసభ పదవులు భర్తీ చేస్తే అందులో రెండు బిజెపికి విడిచిపెట్టింది. దీంతో టీడీపీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆశావహులు చూస్తే అధికంగా ఉన్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ టిడిపి ఆలోచన వేరేలా ఉంది.
* చాలామంది ఆశావహులు..
ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తీసుకుంటే సీట్లు త్యాగం చేసిన చాలా మంది నేతలు ఉన్నారు. వారు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ, బుద్దా వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం వర్మ.. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది నేతలకు పదవులు దక్కలేదు. రాజ్యసభ తో పాటు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. కానీ వీరికి చోటు దక్కలేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా రాజ్యసభ పదవుల భర్తీతో.. ఛాన్స్ దొరకని వారు అసంతృప్తితో ఉన్నారు. అయితే అటువంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఏడాది దాదాపు 20కి పైగా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.
* వచ్చే ఏడాది భారీగా ఖాళీలు..
ప్రస్తుతం శాసనమండలిలో 30కి పైగా ఎమ్మెల్సీ పదవులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎక్కువగా ఆ పార్టీకి ఉన్నారు. వచ్చే నెలలో జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీకాలం కూడా ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా తమ పదవీ కాలాన్ని పూర్తిచేయనున్నారు వచ్చే ఏడాదికి. దాదాపు 20 కి పైగా ఎమ్మెల్సీ పదవులతోపాటు మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీ కానుంది. ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు వరుస పెట్టి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రతి నేతకు ఈ విషయంలో సమాచారం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవసరాలకు అనుగుణంగా 2029 ఎన్నికల్లో పోటీ చేయిస్తామని కూడా చంద్రబాబు వారికి హామీ ఇచ్చారట. ఎవర్ని ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా సమాచారం ఇచ్చారట. అందుకే టిడిపి సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారట.
