spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Andaman Strategy: టిడిపి కమిటీలో 'అండమాన్'కు చోటు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

TDP Andaman Strategy: టిడిపి కమిటీలో ‘అండమాన్’కు చోటు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

TDP Andaman Strategy: అండమాన్ పై ( Andaman) ప్రత్యేక ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. గత రెండు దశాబ్దాలుగా అక్కడ టిడిపి ముద్ర ఉంది. ఇప్పటికే ఒక కార్పొరేషన్ తో పాటు ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది టీడీపీ. మిత్రుల సహకారంతో రెండు చోట్ల విజయం సాధించింది. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అండమాన్ పై. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు టిడిపి అధ్యక్షుడిని నియమించారు. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గంలో అండమాన్ నేతకు అవకాశం ఇచ్చారు. వి. మాధవ నాయుడుకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారు. తద్వారా అండమాన్ లో పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది.

* ప్రత్యేక అధ్యక్షుడి నియామకం..
ఏపీలో( Andhra Pradesh) అధికారంలోకి వచ్చిన వెంటనే అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు చంద్రబాబు. 2024 అక్టోబర్ లో అండమాన్ నికోబార్ దీవులకు టిడిపి అధ్యక్షుడిగా నక్కల మాణిక్యాలరావును నియమించారు. జనాభాపరంగా తెలుగువారు మూడో స్థానంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లేయర్ లో తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉనికి చాటుకుంటూ వస్తోంది. 2023లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఐదో డివిజన్ కార్పొరేటర్ గా ఎస్ సెల్వి విజయం సాధించారు. బిజెపి సహకారంతో ఆమె ఏకంగా పోర్ట్ బ్లేయర్ మేయర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఒక నగరాన్ని టిడిపి దక్కించుకోవడం అప్పట్లో సంచలనమే. అయితే పోర్టు బ్లేయర్లో తెలుగుదేశం పార్టీ తన ఓటు శాతాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2010లో జరిగిన ఎన్నికల్లో టిడిపి పోటీ చేసి నాలుగు శాతం ఓట్లను కైవసం చేసుకుని ఒక సీటును కూడా సాధించింది. అయితే అప్పటికి ఇంకా టిడిపి అండమాన్ నికోబార్ శాఖకు గుర్తింపు రాలేదు. దీంతో పార్టీ గుర్తుపై పోటీ చేయలేకపోయింది. 2017 ఎన్నికలకు వచ్చేసరికి టిడిపి అండమాన్ నికోబార్ శాఖకు గుర్తింపు లభించడంతో సైకిల్ గుర్తుపై పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించిన టిడిపి రెండు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. 2022లో మాత్రం మరోసారి పోటీ చేసి రెండు స్థానాలకు పరిమితం అయింది. అయినా సరే మిత్రుల సహకారంతో 2023లో పోర్టు బ్లేయర్ నగరపాలక సంస్థపై టిడిపి జెండా ఎగురువేసింది.

* శ్రీ విజయపురం మున్సిపాలిటీ సైతం..
కేవలం పోర్టు బ్లేయర్ కే ( Port Blair )పరిమితం కాలేదు టిడిపి గెలుపు. దక్షిణ అండమాన్ లోని శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా కూడా టిడిపికి చెందిన సాహుల్ హమీద్ విజయం సాధించారు. 2022లో మున్సిపల్ ఎన్నికలు జరగక ఒక వార్డు నుంచి టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర మిత్రుల సహకారంతో ఘనవిజయం సాధించారు. అయితే ఈ రెండు ఎన్నికల్లోను మాధవ నాయుడు పాత్ర ఉంది. ఆయన అప్పట్లో అండమాన్ రాష్ట్ర ఇంచార్జ్ గా ఉంటూ ఎన్నికలను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు బిజెపితో సంప్రదింపులు జరిపి టిడిపికి ఈ మున్సిపల్ పీఠం దక్కేలా చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లో టిడిపి అధ్యక్షుడిగా ఉన్న మాణిక్యాలరావు యాదవ్ తో సమన్వయం చేసుకుంటూ మాధవ నాయుడు ముందుకెళ్లారు. అందుకే తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోసారి ఆయన ఛాన్స్ దక్కించుకున్నారు. త్వరలో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలిసి మరోసారి సత్తా చాటేందుకు టిడిపి వ్యూహం పన్నుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version