Star Director Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ( Andhra University) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు చేసి వందేళ్లు అవుతున్న తరుణంలో శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, విశిష్ట అతిథిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఏపీ, ఒడిస్సా గవర్నర్లు అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఏపీ సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ.. ఇలా చాలామంది హాజరయ్యారు. అయితే ఇలా అతిథులుగా వచ్చిన వారిలో ఏయూ పూర్వ విద్యార్థులే అధికం. వెంకయ్య నాయుడు ఇక్కడే చదువుకున్నారు. కంభంపాటి హరిబాబు కూడా ఇక్కడే చదువుకున్నారు. అయితే పూర్వ విద్యార్థి హోదాలో హాజరయ్యారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన అద్భుత ప్రసంగం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే అన్ని రంగాల ప్రముఖులను అందించింది ఆంధ్రా యూనివర్సిటీ. శతాబ్ది వేడుకల కేంద్రంగా అది స్పష్టంగా కనిపించింది.
శతాబ్ది ఉత్సవాలకు హాజరు..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న చాలామంది ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏయూ పూర్వ విద్యార్థి అన్న విషయం ఎవరికీ తెలియదు. శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యేసరికి ఈ విషయం బయటపడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. మాటల రచయితగా, కథ రచయితగా, దర్శకుడిగా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించారు త్రివిక్రమ్. ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆయనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అయితే ఎమ్మెస్సీ చదివిన తర్వాత కొద్ది రోజులపాటు ఉపాధ్యాయుడుగా కూడా పనిచేశారు. ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు.
చిత్ర పరిశ్రమలో గుర్తింపు..
ఏయూ పూర్వ విద్యార్థిగా ఆయనకు ఆహ్వానించారు నిర్వాహకులు. భారత ఉపరాష్ట్రపతి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు ప్రముఖులంతా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ తనను పూర్వ విద్యార్థి హోదాలో ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలో తాను చాలా నేర్చుకున్నానని.. రంగం మారినా తన ఎదుగుదల వెనుక మాత్రం ఆంధ్రా యూనివర్సిటీ అనుభవం పని చేసిందని చెప్పారు. అయితే ఉపాధ్యాయుడిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యం పై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1999లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. హాస్యనటుడు సునీల్ కు మంచి స్నేహితుడు . చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో సునీల్తో కలిసి ఒకే గదిలో ఉండేవారట. పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్ను ప్రారంభించారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, రచయితగా సేవలందించారు. అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు.
