Jagan Mohan Reddy Alliances: సింహం సింగిల్ గానే వస్తుంది. ఒకరితో పొత్తు పెట్టుకునే కర్మ మాది కాదు. మాదంతా వన్ వే. ఈ మాటలు ఎవరి నోట వస్తాయో అందరికీ తెలిసినదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రామస్థాయి నేత వరకు ఇదే మాట. అయితే ఇందులో వాస్తవం ఉందా అంటే.. ఎంత మాత్రం లేదని సమాధానం వస్తుంది. ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు వైసిపి ఎవరితోనో అధికారిక రాజకీయ పొత్తులు పెట్టుకోదు. కానీ తెరచాటు వ్యవహారాలు మాత్రం నడుస్తుంటాయి. అంతర్గత బంధాలను కొనసాగిస్తుంది. 2014 నుంచి ఈరోజు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడు కేంద్ర బిజెపిపై ఏ ఒక్క అంశంపై నోరు ఎత్తి విమర్శ చేయలేదు. అంతటి సాహసానికి కూడా పూనుకోలేదు.
* కేసుల భయంతోనే..
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఆ బలం వెనుక ఎన్నో రకాల వ్యూహాలు ఉంటాయి. రాష్ట్రాల పాలకులను ఎలా అదుపులోకి తీసుకురావాలో కేంద్ర పెద్దలకు తెలుసు. దానికి ఎలా మూల్యం చెల్లించుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చివరకు అదే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేలా చేశారు. తాను ఎన్డీఏ లో చేరకుండా.. భాగస్వామ్య పార్టీకి కలిగిన అన్ని రకాల ప్రయోజనాలను పొందారు. ఐదేళ్ల తన పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి పోలవరం పూర్తి వరకు ఎన్నడూ ఒక్క డిమాండ్ కూడా చేసిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది వైసిపి చేస్తున్న విమర్శ. ఇక్కడ కూడా బిజెపి కళ్ళల్లో చూసి విమర్శలు చేయడం లేదు. ఎంతవరకు టిడిపి టార్గెట్ గా కొనసాగింది ఈవీఎంల విమర్శ.
* బిజెపికి ఎప్పుడు సహకారమే..
రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప ఇతర ప్రయోజనాల విషయంలో బిజెపితో రాజీ పడే అవకాశం లేదు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తోంది. కానీ చట్టసభలలో బిజెపి పెట్టే ప్రతి బిల్లుకు సహకారం అందిస్తోంది. లోక్సభ స్పీకర్ విషయంలో అడగకుండానే మద్దతు ప్రకటించింది. తన అక్రమాస్తుల కేసులు బెయిల్ వద్ద ఆగిపోయాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కూడా ముందడుగు పడటం లేదు. తిరుమల కల్తీ వ్యవహారంలో సైతం బిజెపి సహకారం లేనిదే తన మనుగడ కష్టం అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేసి గులాబీ పార్టీ అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభిమానమే. తెరచాటుగా గులాబీ పార్టీతో కలిసి బలమైన మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రయోజనాలను సైతం రాజీ పడే గొప్ప మనస్తత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఒకే ఒక్క సంతకం తో నాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ హైదరాబాద్ లో ఉమ్మడి ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చారు.
* అజ్ఞాత మిత్రుడిగా కెసిఆర్..
పరస్పర రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏపీ రాజకీయాలలో కేసీఆర్ రిటర్న్ గిఫ్టులు ఇచ్చే స్థాయికి వెళ్లిపోవడం… ఏపీలో వైసీపీ చేసిన అరాచకాలకు తెలంగాణలో కేసీఆర్ రిటర్న్ గిఫ్టులు అందుకున్నా.. వారి మధ్య బంధం మాత్రం చెదిరిపోలేదు. జగన్ ఒక్కడి వల్ల కాదు ఇప్పుడు పరిస్థితి. ఏపీలో చోటామోటా పార్టీల నేతలను కలుపుకెళ్లాల్సిన దుస్థితి. ఏపీ రాజకీయాల నుంచి ఫేడ్ అవుట్ అయిన నేతల సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి దాపురించింది. అందుకే సింహం సింగిల్ అనే మాటకు తావు లేదు. తెరచాటు రాజకీయాలకు ఇక చెల్లుచీటు.