Raghu Rama Krishnam Raju: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ అసెంబ్లీ టిక్కెట్ను అనూహ్యంగా దక్కించుకున్నారు రఘురామకృష్ణం రాజు. ఎంపీగా పోటీ చేద్దామనుకున్న ఆయనకు చాన్స్ దక్కలేదు. దీంతో చివరి నిమిషంలో ఉండి శాసనసభ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అక్కడ నుంచి గెలిచిన రఘురామకృష్ణం రాజుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి రఘురామకృష్ణంరాజుకు ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు నాయకత్వంపై కొంతమంది టిడిపి నాయకులు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. టిడిపి సీనియర్ నాయకుడు మీడియా ముందుకు వచ్చి తనకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నుంచి ప్రాణహాని ఉందని చెప్పడం ప్రకంపనలు రేపుతోంది.
* వైసీపీలో అలా..
2019లో నరసాపురం( narasapuram ) పార్లమెంట్ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డితో విభేదించారు. ఆ పార్టీలో ప్రత్యర్థిగా మారిపోయారు. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు అరెస్ట్.. కస్టోడియల్ టార్చర్ చేశారని ఆరోపణలు రావడం జరిగిపోయాయి. అప్పటినుంచి పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. బిజెపిలో చేరి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ అవకాశం చిక్కలేదు. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి శాసనసభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టిడిపి రఘురామకృష్ణంరాజు టిక్కెట్ ఇవ్వడం విశేషం.
* అసెంబ్లీ సమావేశాల సమయంలో..
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్( AP assembly budget sessions ) సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉండికి చెందిన టిడిపి సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు మీడియా సమావేశం నిర్వహించారు. రఘురామకృష్ణం రాజు పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి తనను రక్షించాలని వేడుకున్నారు. టిడిపి నేత ఆరోపణలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేశ్వరరాజు స్వగ్రామం ఉండి మండలంలోని వెలిపర్రు. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. రఘురామకృష్ణం రాజు వైఖరితో టిడిపి శ్రేణులు ఇబ్బంది పడుతున్నారని కూడా ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సొంత పార్టీ నేత ఈ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
* టిడిపికి కంచుకోట..
వాస్తవానికి ఉండి( Undi) నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు విభేదాలు వెలుగు చూడటం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణమేమిటి? ఎవరి వల్ల ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనిపై హై కమాండ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తోంది.