YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మొన్న రాజ్యసభ పదవి దక్కకపోవడం నుంచి షర్మిల సైలెన్స్ గా ఉన్నారు. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆమె ఆలోచన మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పింది. దీని వెనుక పెద్ద రాజకీయం నడిచినట్టు షర్మిల అనుమానిస్తున్నారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదు సరి కదా భవిష్యత్తులో తనను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనకు వచ్చారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా కొన్ని రోజులు రాజకీయంగా మౌనముద్రలోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ వైఖరి మారింది. ఆ పార్టీ ఆలోచన మారుతోంది. కేవలం ఏపీ కోసం కాంగ్రెస్ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. జాతీయస్థాయి పరిణామాలతో ఏపీలో వ్యవహరిస్తే తన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని షర్మిల ఒక అంచనాకు వచ్చారు. అందుకే తాత్కాలికంగా కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
* కాంగ్రెస్ కొత్త ఆలోచన..
దేశవ్యాప్తంగా బలం పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు బిజెపి చేతిలో దెబ్బతిన్న ఒక్కో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తుంది. మొన్ననే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ సాయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు బిజెపి బారిన పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలు.. జాతీయస్థాయిలో అండ కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఈ తరుణంలో ఏదో ఒక రోజు జగన్ సైతం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి.
* అప్పటి పరిస్థితులకు తగ్గట్టు..
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా పొలిటికల్ సీన్ మారనుంది. వచ్చే ఏడాది కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కానీ బిజెపికి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం ట్రెండ్ మారుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కు దగ్గర కాక తప్పదు. షర్మిల లో కూడా అదే అనుమానం. జాతీయస్థాయిలో అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకుంటే తన పరిస్థితి ఏంటనే ఆందోళన ఆమెలో ఉంది. పైగా కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది ఒక అనుమానం. పైగా ఏపీ పార్టీ పగ్గాలు అందుకొని రెండు సంవత్సరాలకు పైగా దాటుతోంది. ఈ క్రమంలో తనను పదవి నుంచి తీసేస్తే సామాన్య కార్యకర్తగా కొనసాగలేని పరిస్థితి. పోనీ ఏఐసీసీలోకి తీసుకున్నా.. ఎటువంటి పవర్ పాలిటిక్స్ చేయలేరు. అందుకే కొద్ది రోజులపాటు సైలెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో
