Sai Krishna Missing Case: ఏపీలో ఏ చిన్న అంశం జరిగిన రాజకీయం చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం వెనుక కులం కార్డు, రాజకీయ కోణం కనిపిస్తోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. పోలీస్ కస్టడీ తరువాత ఆయన అదృశ్యం అయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కస్టడీలోనే ఘాతుకం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలోనే ఆయనపై దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు బాధితుడు తల్లి హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ అధికారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం ఆ సీఐను విఆర్ లో పెట్టింది. ఇంతవరకు ఆ కేసు లో మిస్టరీ మాత్రం వీడడం లేదు..
* చాలా క్రిమినల్ కేసులు..
సాయి కృష్ణ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. దీనిపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీస్ కస్టడీలో ఏదైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. విచారించిన కోర్టు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం లాకభ్యత జరిగిందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
* లాకప్ డెత్ అంటూ ఆరోపణ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు కాపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గాది సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబం జనసేనకు అండగా నిలిచిందని… అటువంటి కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అయితే కేవలం వైసీపీ ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేస్తోంది. బాధిత కుటుంబం తరఫున ఎటువంటి న్యాయపోరాటం చేయడం లేదు. పెద్దగా ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా లేవు. అయితే ఇదే అంశాన్ని పట్టుకొని ఇప్పుడు వైసిపి రాష్ట్రవ్యాప్తంగా కాపు రాజకీయాన్ని కాక రేపాలని చూస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో దీనిపైన ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా కాపుల్లో రగడ సృష్టించేందుకేనని అర్థమవుతోంది. మరోవైపు పోలీసులు మాత్రం సాయి కృష్ణ తమ అదుపులో లేడని చెబుతున్నారు. దీంతో ఆయన అదృశ్యం మిస్టరీ వీడడం లేదు.
