Roja Tamil Nadu Election Campaign DMK: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అక్కడ అధికార డిఎంకెకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో భిన్న స్వరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చింది. కేంద్రం అడగకుండానే అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తమిళనాడులో తమ పార్టీ నేతలను ప్రచారానికి పంపిస్తున్నారు జగన్. అయితే అది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆమె వెళ్లారా? లేకుంటే ఆమె సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి డీఎంకే విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్టాలిన్ విచ్చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి మద్దతుగా రోజా ప్రచారం చేస్తుండడం విశేషం.
*ఎక్కువగా చెన్నైలోనే..
మొన్నటి ఎన్నికల్లో రోజా ఓడిపోయిన తర్వాత ఎక్కువగా చెన్నైలోనే గడిపారు. దీంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి తమిళంలో సెటిల్ అవుతారని ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి డిఎంకెలో చేరిపోతారని కూడా టాక్ నడిచింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు బుల్లితెరలో కూడా అవకాశాలు తగ్గాయి. సినిమాల్లో కూడా అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కలేదు. పైగా ఓడిపోయిన తర్వాత కేవలం చెన్నైకి మాత్రమే పరిమితం అయ్యారు. కనీసం ఏపీ వైపు చూడలేదు. సొంత నియోజకవర్గం నగిరి కి కూడా రాలేదు.
* సోషల్ మీడియాలో హల్ చల్..
అయితే డీఎంకేకు మద్దతుగా ఇప్పుడు రోజా ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఐరన్ లెగ్ ముద్ర రోజాపై ఉంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే తమిళనాడులో డీఎంకే గెలిచే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు రోజా డిఎంకేకు మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. పొరపాటున డీఎంకే ఓడిపోతే మాత్రం రోజా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురికావడం ఖాయం.