Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: టిడిపి, జనసేన తెలంగాణకు దూరంగా ఉండటమే మంచిది

RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: టిడిపి, జనసేన తెలంగాణకు దూరంగా ఉండటమే మంచిది

RK Kotha Paluku: చాలాకాలం తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. తనలో ఉన్న జర్నలిస్టును బయటకు తీసుకొచ్చారు. మార్మికంగా ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టే విధంగా రాశారు. ఫలితంగా ఈ ఆదివారం కొత్త పలుకు చాలామందికి గడ్డి పెట్టే విధంగా ఉంది. కొందరికి అయితే కర్రు కాల్చి వాతపెట్టినట్టుగా ఉంది.

కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాలలో మళ్ళీ ప్రాంతీయవాదం కనిపిస్తోంది. ఓ రాజకీయ విశ్లేషకుడి మాటలు.. అవి కాస్త వివాదాస్పదమైన తీరు.. దానికి తెలంగాణ సెంటిమెంట్ పూయడం.. ఇంకా రకరకాల విషయాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఆ విశ్లేషకుడి మాటలకు కొంతమంది కావాలని తెలంగాణ వాదాన్ని పూశారు. జనసేన అధినేత పవన్ సరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సమావేశం పెట్టడం.. దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పడం.. కొంతమంది మంత్రులు స్థాయి దాటి పవన్ మీద విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి.

ఈ లోగానే కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించారని తెరపైకి వచ్చారు. వారి తర్వాత కల్వకుంట్ల కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన చెరువు శిఖాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇలా వరుసగా జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఔత్సాహికులు మరింత రెచ్చిపోతున్నారు. తెలంగాణ సెటిల్మెంట్ విషయంలో మరింత అగ్గి రాజేస్తున్నారు. వారందరికీ రాధాకృష్ణ గట్టిగానే గడ్డి పెట్టారు. కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే గులాబీ పార్టీ నాయకుల వరకు అందరికీ కర్రు కాల్చి వాతపెట్టారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో రాసిన సంపాదకీయం లేదు.

తెలంగాణ ఏర్పాటును సిపిఎం వ్యతిరేకించింది. ఆ పార్టీకి నాగేశ్వర్ సానుభూతిపరుడు. అటువంటి నాగేశ్వర్ తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోలేదు.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జా చేశారు. నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పదేపదే ఈ స్థాయిలో విమర్శలు చేశారు.. కానీ ఈ నాటికి కూడా రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులకు టార్గెట్ గా లేరు.

కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతే అది గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది బీఆర్ ఎస్ కు ప్రయోజనం కలిగిస్తుంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారంటే.. దానివల్ల రేవంత్ రెడ్డి నష్టపోవడం గ్యారంటీ.

తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన ప్రవేశిస్తే ప్రతిఘటన ఉంటుందని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకోకపోవడమే మంచిది. అయితే ఇది కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారి సంస్థలకు తెలంగాణలో కాంట్రాక్టర్లు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఆ కంపెనీలు వెళ్లిపోతే పనులు ఎవరు చేస్తారు

విదేశీ కంపెనీలకు భారీగా రాయితీలిచ్చి.. అన్ని రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్ర కంపెనీల మీద ద్వేషాన్ని ప్రదర్శించడం ఏంటి.. ఇక్కడ ఆంధ్ర కంపెనీలు పన్నులు చెల్లిస్తున్నాయి కదా

భారత రాష్ట్ర సమితి తమ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లను.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది.. తెలంగాణ వాదులు దీనికోసం పోరాటం చేయాలి.. అనవసరంగా ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. దీనివల్ల లాభం కూడా ఉండదు

ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయ పరంపర. వాస్తవానికి ఈ స్థాయిలో ఏ పాత్రికేయుడు కూడా విశ్లేషణ చేయలేదు. న్యూట్రల్ గా రాసుకుంటూ రాలేదు. అందువల్లే రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం మిస్సైల్ లాగా పేలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular