Rayalaseema Development: రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాయలసీమ కేంద్రంగా ఎందరో రాజకీయాలు చేశారు. కానీ ఆ స్థాయిలో రాయలసీమ మాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ కూటమి వచ్చిన తరువాత రాయలసీమ రూపురేఖలు మారుతున్నాయి. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, రాజకీయ శంకుస్థాపనల డ్రామాతో విసిగిపోయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు ఒక బలమైన ముందడుగు పడింది. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనున్నారు. ఇది కేవలం కొబ్బరికాయలు కొట్టే మరో సాంప్రదాయక భూమి పూజ కాదు. పక్కాగా నిర్మాణ పనుల ప్రారంభోత్సవం. జిందాల్ ఆధ్వర్యంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ తొలి దశ ఉత్పత్తిని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేలా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇది నిజంగా రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో వివాదాల మయంగా మారిన రాయలసీమ.. ఇప్పుడు పారిశ్రామికంగా.. రాయల పరిశ్రమల సీమగా రూపాంతరం చెందుతూ ఉండడం శుభపరిణామం.
* శ్రీ సిటీ కీలక పాత్ర..
ఉత్పత్తి రంగానికి సంబంధించిన పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడంలో శ్రీ సిటీ కీలక పాత్ర పోషించింది. గ్లోబల్ కంపెనీలకు క్యారాఫ్ అడ్రస్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పరిశ్రమల జాతర ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వచ్చిన పెట్టుబడులు మరో ఎత్తు. రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటో కార్ఫ్ వంటి దిగ్గజ సంస్థలు రాయలసీమలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ ప్లాంట్లను నిర్మించాయి. వేలాదిమంది స్థానిక యువతకు, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాయి. గతంలో వచ్చిన కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించింది. అయితే ప్రస్తుతం శ్రీ సిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పారిశ్రామిక వైభవానికి సరికొత్త కేంద్రంగా మారింది.
* గ్రీన్ ఎనర్జీ రంగంలో..
అన్నింటికీ మించి రాయలసీమ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే టాప్ హబ్ గా మారింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో గ్రీన్ కో, ఆర్సలర్ మిట్టల్, ఐర్ఈడిఏ భాగస్వామ్యంతో ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు వేగం గా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో వెనుకబడిన ప్రాంతంగా.. కరువు సీమగా ముద్రపడిన రాయలసీమ.. ఇప్పుడు పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అటు బెంగళూరు ఐటి, ఆటోమొబైల్ క్యారీడర్.. ఇటు చెన్నై పోర్టులకు కనెక్టివిటీ ఉండడంతో రాయలసీమ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ప్రధానంగా ఖనిజ సంపద, ఇనుప ఖనిజం, సున్నపురాయి నిల్వలు భారీ సిమెంట్, స్టీల్ పరిశ్రమలకు బలమైన పునాదులుగా మారాయి. బలమైన రాజకీయ సంకల్పం, స్థిరమైన పారిశ్రామిక విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుండడంతో రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది.

