CM Chandrababu
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ( Telugu Desam) సమూల ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. వేసవిలో జరిగే మహానాడు నాటికి జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలతో పాటు పొలిట్ బ్యూరోలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. వీలైనంతవరకూ సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. తద్వారా పార్టీలో యువ రక్తం ఎక్కించాలని భావిస్తున్నారు. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చంద్రబాబు శరవేగంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మూడుసార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారిని పక్కన పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సీనియర్లకు చెక్ పడినట్టే.
* లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
నారా లోకేష్( Nara Lokesh) నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆ ఇద్దరూ పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ ను ప్రమోట్ చేయడంలో ఉన్నారు చంద్రబాబు. అదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని నందమూరి బాలకృష్ణకు ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనే.. ఆయన భవిష్యత్తుకు బాగుంటుందని చంద్రబాబు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం.
* పొలిట్ బ్యూరోలో మార్పులు
ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో( polit bureau ) చాలామంది సీనియర్లు ఉన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎండి షరీఫ్, బోండా ఉమామహేశ్వరరావు, ఎం ఎం డి ఫరూక్, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, గల్లా జయదేవ్, పితాని చంద్రశేఖర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అరవింద్ కుమార్ గౌడ్ సభ్యులు కాగా.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ ఉన్నారు. తాజా నిర్ణయం మేరకు కొందరు సభ్యులను తొలగించే అవకాశం ఉంది. వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
* ఆ ఇద్దరి పదవులు తొలగింపు
జాతీయ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేష్, రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) లను తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వారు తమ పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వీధి స్థానంలో కమిటీలో కొత్తవారికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ కమిటీలు ముగ్గురు మహిళలు ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. ఇక కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యమిస్తూ.. ప్రాంతీయ, సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చేర్పులు, మార్పులను పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పదవుల వ్యవహారం ఉత్కంఠ పెంచుతోంది.