Radha Gayatri Last Words: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతి రాధా గాయత్రి ఇటీవల ముసోరి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈమె మరణం మీద ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఆమె భర్త శ్రీ చరణ్ మీద హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాను నిరపరాధిని అంటూ శ్రీ చరణ్ చెబుతున్నారు. మరోవైపు తమ కూతురుది హత్యా అని రాధా గాయత్రి తల్లిదండ్రులు చెబుతున్నారు.
రాధా గాయత్రి ఐటి సంస్థలో పనిచేస్తోంది. ఇటీవల తన భర్తతో కలిసి ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ముస్సూరీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు గుండెలు పగిలే విధంగా రోధిస్తున్నారు. ఈ క్రమంలోనే రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు నేపథ్యంలో ముసోరి పోలీసులు రాధా గాయత్రి భర్త మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రోజురోజుకు కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. అందులో రాధా గాయత్రి మాటలు వినిపిస్తున్నాయి. ఆమె తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఇవే రాధా గాయత్రి తన చివరి మాటలు.
రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతున్న మాటల్లో ఆర్ద్రత కనిపిస్తోంది. ఆవేదన ధ్వనిస్తోంది.” నన్ను అనుమానిస్తున్నాడు. ప్రతిక్షణం ఇబ్బంది పెడుతున్నాడు. ఫోన్ చేస్తే పక్కన ఎవరున్నారు అడుగుతున్నాడు. ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు అంటున్నాడు. మగ గొంతు వినిపిస్తోంది.. పక్కన ఉన్నది వాడేనా అని అంటున్నాడు. అతడి మీద నాకు నమ్మకం పోయింది. మనసు విరిగిపోయింది. అనుమానం విపరీతంగా పెంచుకుంటున్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను నేరుగా అడగమని చెప్పేశాను. వాళ్ళ అమ్మతో కూడా చెప్పాను. అతనితో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే మా అమ్మానాన్నతో మాట్లాడమని చెప్పాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవన్నీ కూడా దాటిపోయాయి.. అతడు దారుణంగా ప్రవర్తిస్తున్నాడని” రాధా గాయత్రి తన తల్లితో చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో రాధా గాయత్రి తండ్రి కూడా సంచలన విషయాలను చెప్పాడు. రాధా గాయత్రి బ్యాగులో శ్రీ చరణ్ ట్రాకర్ పెట్టాడని అతడు ఆరోపించాడు. వివాహం జరిగినప్పటి నుంచి మానసికంగా వేధింపులకు గురి చేశాడని రాధా గాయత్రి తండ్రి వివరించాడు. శ్రీచరణ్ గురించి అనేక పర్యాయాలు తమకు చెప్పిందని రాధా గాయత్రి తండ్రి వాపోతున్నారు. రాధా గాయత్రి కి లోబీపీ సమస్య లేదని.. ఈ దారుణం జరిగిన రోజు శ్రీ చరణ్ రక్త నమూనాలు సేకరించకపోవడం పట్ల రాధా గాయత్రి తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రి కి మద్యం తాగే అలవాటు లేదని.. తన కూతురు అలాంటిది కాదని ఆయన చెబుతున్నారు.
