PM Modi And Nara Lokesh: ప్రధాని మోదీతో( Prime Minister Narendra Modi) లోకేష్ కున్న వ్యక్తిగత బంధం ఢిల్లీ వేదికగా బయటపడింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి భేటీ ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశంలో ప్రధాని మోదీతో లోకేష్ దంపతులు ఆత్మీయంగా సంభాషించారు. దేశాభివృద్ధి దిశగా ప్రధాని చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. 2004 నాటికి వికసించిన భారత్ దిశగా దేశాన్ని నడిపించడంలో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. లోకేష్ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమయం కేటాయించడం హాట్ టాపిక్ అవుతోంది.
* యువగళం టేబుల్ బుక్ ఆవిష్కరణ..
ఈ సమావేశంలో లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర ప్రధాన చర్చ అయింది. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో మలుపునకు లోకేష్ పాదయాత్ర కారణమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆ పాదయాత్ర ఆధారంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘యువగళం’ తొలి కాపీని ప్రధాని మోడీ స్వయంగా ఆవిష్కరించారు. లోకేష్ పాదయాత్ర సమయంలో ప్రజలతో గడిపిన క్షణాలు , అనుభవాలు, రాష్ట్రం కోసం ఆయన కలలు, ప్రభుత్వంపై ఉన్న ప్రజల ఆశలు అన్నింటిని స్పష్టంగా వివరించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ తన సంతకం చేసి లోకేష్ కు ప్రత్యేకంగా అందించారు. మోదీ అందించిన ఆశీస్సులను ఎన్నటికీ మరువలేనని లోకేష్ అన్నారు.

* దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణ
మరోవైపు లోకేష్ కుమారుడు దేవాన్ష్ ( Devansh) ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవాన్ష్ ని చూసిన ప్రధాని ముచ్చటపడి దగ్గరకు తీసుకున్నారు. ఆప్యాయంగా పలకరించారు. ఎత్తుకొని హత్తుకున్నారు. తాతయ్య చంద్రబాబు కోసం ఆరా తీశారు. మోడీ అడిగిన ప్రశ్నలకు చలాకీగా సమాధానం చెప్పాడు దేవాన్ష్. దీంతో ప్రధాని మరింత ముగ్ధుడయ్యారు. నారా బ్రాహ్మణిని పలకరించి కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురిని ప్రధాని మోదీ ఆశీర్వచనాలు అందించారు.

* ఏపీ ప్రగతి కోసం చర్చ..
ప్రధాని మోదీతో ప్రధానంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ( NDA government ) పాలన, అభివృద్ధి, వృద్ధి లక్ష్యాలపై ప్రధాన చర్చ సాగింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని.. దీనికి ప్రధాని మద్దతు ముఖ్యమని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఏపీ దేశానికే మార్గదర్శిగా నిలవగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా ఎన్నెన్నో సందేహాలకు బ్రేక్ పడింది. ప్రధాని నరేంద్ర మోడీతో లోకేష్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం బయటపడింది. రాజకీయ సంబంధాలకు మించి వ్యక్తిగత మైత్రి కూడా ఉందనే సంకేతాలు వచ్చాయి. ప్రధాని మోదీ ఆశీస్సులతో, మార్గదర్శకత్వంతో లోకేష్ ముందుకెళ్తే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత మద్దతు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీకి ప్రధాని వచ్చిన తరుణంలో లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆహ్వానంతోనే లోకేష్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. వీరి భేటీ రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది.