Jagan: ఇదేం గ్రహచారం.. తల్లి, చెల్లెలిపై జగన్ దంపతుల న్యాయపోరాటం! దేని కోసమంటే?

సోదరుడు జగన్ తో రాజకీయంగా విభేదించారు షర్మిల. అయితే దీనికి ఆస్తి వ్యవహారాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. సోదరి కోసం అహోరాత్రులు శ్రమించారు షర్మిల. అయితే అధికారంలోకి వచ్చాక న్యాయం చేయకపోగా.. తండ్రి వారసత్వంగా ఆస్తిని ఇచ్చేందుకు సైతం అంగీకరించలేదు. దీంతో వారి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి.

Written By: Dharma, Updated On : October 23, 2024 1:13 pm

Jagan(3)

Follow us on

Jagan: వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అడ్డగోలుగా చీలిక వచ్చింది.రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆ కుటుంబం ఐక్యతగా సాగేది.కానీ ఆయన మరణానంతరం కుటుంబంలో విభేదాలు వెలుగుచూశాయి. వివేకానంద రెడ్డి మరణం తర్వాత మరింత బలపడ్డాయి.2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తర్వాత తారాస్థాయికి చేరుకున్నాయి. వివేకానంద రెడ్డిని సొంత కుటుంబ సభ్యులే పొట్టన పెట్టుకోవడం.. నిందితులకు జగన్ కొమ్ము కాయడం.. బాధితురాలిగా మిగిలిన వివేక కుమార్తె సునీతను వేధించడం అందరికీ తెలిసిందే. అటు సొంత సోదరి షర్మిలకు తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల విషయంలో మొండి చేయి చూపడంతో.. ఆమె సైతం సొంత రాజకీయ అజెండాను ప్రారంభించారు. తెలంగాణ వేదికగా పొలిటికల్ పార్టీని స్థాపించారు. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని కాంగ్రెస్లో ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు నుంచే సోదరుడుకు వ్యతిరేకంగా గళం ఎత్తారు.ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల ఎంతగానో కృషి చేశారు.అందుకే ఇప్పుడు అదే షర్మిలాను జగన్ టార్గెట్ చేసుకున్నారు. చెల్లెలికి మద్దతుగా నిలిచిన తల్లి పై సైతం న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు తెలుగు నాట ఇదే హాట్ టాపిక్ గా మారింది.

* ఇద్దరిపై పిటిషన్ల దాఖలు
తాజాగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేశారు. సెప్టెంబర్ లోనే జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చే నెలలో విచారణ జరగనుంది. తన ఓటమికి చెల్లెలు షర్మిల కారణమని.. ఆమెకు మద్దతుగా నిలిచిన తల్లి విజయమ్మపై సైతం జగన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సరస్వతి పవర్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే అది కేవలం పేపర్ల పైన మాత్రమే. ఆ కంపెనీ ఎటువంటి ఉత్పత్తులు జరపడం లేదు. పల్నాడు ప్రాంతంలో పరిశ్రమలు పెడతామని.. ఉపాధి కల్పిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ కంపెనీల్లో తల్లితోపాటు చెల్లికి షేర్లు ఇచ్చారు. అయితే ఈ భూములు కారు చౌకగా కొట్టేసినవి. తనను విభేదించే తల్లి, చెల్లెలకు తాను సేకరించిన భూములు ఇవ్వడం ఏమిటనేది జగన్ బాధ.

* కుమార్తెకు షేర్ల బదలాయింపు
ఇటీవల ఆ కంపెనీ షేర్లను విజయమ్మ తన కుమార్తె షర్మిల పేరిట ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో మరింత రగిలిపోయారు జగన్. అందుకే తన షేర్లు తనకు ఇచ్చేయాలని ఆయన ఏకంగా ఎన్సిఎల్టిని ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో జగన్ భార్య భారతి కూడా సహా పిటీషనర్ గా ఉన్నారు. అంటే దంపతులిద్దరూ విజయమ్మతో పాటు షర్మిలను కోర్టుకు లాగినట్లు అయ్యింది. జగన్ రాజకీయ ఉన్నది కోసం తల్లితో పాటు చెల్లెలు కూడా పోరాడారు. విజయమ్మను ఏకంగా గౌరవాధ్యక్షురాలు చేసి అసెంబ్లీకి పంపించారు. చెల్లెలు షర్మిల తో తనకు మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు వారిద్దరినీ ఏకంగా కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే షర్మిల తో జగన్ రాజీ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే సరికొత్త అంశం బయటికి వచ్చింది.