Pawankalyan : రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలకే మనం మూల్యం చెల్లించుకుంటామన్నది దాని అర్ధం. ఇప్పుడు పవన్ సైతం అలాంటి బాధితుడవుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ అన్న నినాదం.. క్రమేపీ టీడీపీకి వరంలా మారుతోంది. అది ఎంతలా అంటే బీజేపీ పక్కన పెట్టినా.. పవన్ మాత్రం టీడీపీని బీజేపీతో సెట్ చేసే పనిలో ఉన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు కలిసే వెళతాయని చెబుతున్నారు.
అయితే పవన్ విషయంలో టీడీపీ హైడ్రామా ఆడుతోంది. తనకు అవసరమనుకున్నప్పుడు ఒకలా.. అవసరం లేదన్నప్పుడు మరోలా చూపే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ విముక్త ఏపీయే తన ధ్యేయమని.. తనకు సీఎం పోస్టుతో పనిలేదన్నప్పుడు పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. అదే తనను అభిమానులు సీఎం పోస్టులో కూర్చోవాలని ఆశిస్తున్నారని.. ప్రజలు భావిస్తే తాను సీఎం తప్పకుండా అవుతానని చెప్పినప్పుడు మాత్రం పవన్ ను ఒక బలహీనమైన నాయకుడిగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే నేతగా చూపించాలని ఆరాటపడుతుంటారు. ఈ విషయంలో ఎల్లోమీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా చేసే అతి అంతా ఇంతా కాదు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీని పిలవకుండా జనసేనను మాత్రమే పిలవడంతో ఒక రకమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పవన్ టీడీపీని విడిచిపెట్టి ఎక్కడ వెళ్లిపోతాడని భావించి అవినీతి నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని టీడీపీ తొలుత మొదలుపెట్టింది. అవినీతి ఆరోపణ కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టయ్యారు. పదవికి దూరమయ్యారు. ఆయనతో పాటు ఓ బినామీ వ్యాపారి ఒకర్నీ అక్కడి విచారణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారి ఖాతాల్లోకి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు జమ అయ్యాయన్నది ఒక ప్రచారం. అందులో ఏపీ నుంచి సైతం పెద్దఎత్తున నగదు చేరినట్టు టాక్ నడుస్తోంది. ఈశ్వరన్ కు చంద్రబాబు సన్నిహితుడు కావడం వల్ల కచ్చితంగా చంద్రబాబు పనేనంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. త్వరలో చంద్రబాబు అరెస్ట్ ఖాయమంటూ మంత్రులు సైతం ప్రకటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే సరిగ్గా ఇదే సమయంలో పవన్ ఎన్డీఏ పక్షాల సమావేశానికి హాజరవుతుండడంతో టీడీపీ కొత్త పన్నాగాన్ని పదునెక్కించింది. చంద్రబాబుతో పాటు పవన్ సైతం యాడ్ చేసింది. ఒక్క చంద్రబాబే కాదు.. ఓ హీరో భార్య ఖాతా నుంచి పెద్దఎత్తున నగదు సింగపూర్ చేరాయని.. అక్కడ సొంత వ్యాపారాల పెట్టుబడులకేనంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇందులో పవన్ భార్యను బయటకు తీశారు. దీంతో ఆ మట్టిని పవన్ కు అంటించాలన్నది ప్లాన్. దీనిని రూపొందించింది టీడీపీ యాక్టివిస్టులు బయటకు వదిలారు. సహజంగా పవన్ పై కోపం ఉన్న వైసీపీ శ్రేణులు వాటిని ట్రోల్ చేస్తున్నాయి. సో ఇటువంటి చర్యలతో ముందుకెళుతున్న టీడీపీనే పవన్ నమ్ముతుండడం ఆందోళన కలిగిస్తోంది. అది పులి మీద స్వారీ చేయడమేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.