Nadendla Manohar: జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు నాదేండ్ల మనోహర్. మెగా బ్రదర్ నాగబాబు ఉన్నా.. నాదేండ్ల మనోహర్ మాత్రం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆయన జనసేనలో చేరిక నుంచి రకరకాలుగా ప్రచారం నడుస్తూ వచ్చింది ఆయనది కమ్మ సామాజిక వర్గం కావడంతో పక్కన పెట్టుకోవద్దని.. గత చరిత్ర చూసుకోవాలని.. చంద్రబాబుకు ఆయన కొవర్టు అని ఇలా ఏదేదో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడి వెంట.. కమ్మ నాయకుడు అయిన నాదెండ్ల మనోహర్ కు ఎందుకంత ప్రాధాన్యత అని చాలామంది అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ విషయంలో అనేక రకాల కామెంట్లు వచ్చాయని.. తనపై ఒత్తిడి పెరిగిందని.. కచ్చితంగా తాను నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకొని పార్టీ నడుపుతానని తెల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ పై నాదేండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి తెచ్చింది ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ అప్పట్లో కాపు నాయకుల నుంచి నాదెండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి వచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించారు పవన్.
* సరిగ్గా ఎన్నికల ముంగిట..
2019 ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయం చవిచూసింది. అయితే 2018 అక్టోబర్లో జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మనోహర్. తండ్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన.. మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మనోహర్ కు శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు మనోహర్. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించి ఆయనకు సమాచారమిచ్చారు. అందుకు పవన్ అంగీకరించడంతో 2018 అక్టోబర్ 12న జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్.
* పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా..
అయితే జనసేనపై కాపు ముద్ర ఉంది. 2018లో నాదెండ్ల మనోహర్ చేరిన తర్వాత చాలామంది కాపు నేతలు విభేదించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నాదెండ్ల మనోహర్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆయనకు కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో స్థానం కల్పించారు. ఆ కమిటీకి చైర్మన్ చేసి తన తరువాత పార్టీలో నెంబర్ 2 పాత్రను కట్టబెట్టారు. అయితే ఇది కాపు నేతలకు ఎంత మాత్రం సహించలేదు. నాదెండ్ల మనోహర్ సామాజిక వర్గం తో పాటు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ను గుర్తుచేస్తూ.. పవన్ కళ్యాణ్ నుంచి నాదెండ్ల మనోహర్ దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ వాటికి అవకాశం ఇవ్వలేదు పవన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే చాలావరకు పవన్ కళ్యాణ్ తో నాదేండ్ల మనోహర్ జర్నీ ఎక్కువ రోజులు ఉండదని ఎక్కువ మంది విశ్లేషించారు. కానీ పవన్ నాయకత్వంలో మనోహర్ పనిచేస్తూనే ఉన్నారు. పవన్ సైతం నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకునే రాజకీయం చేస్తానని ప్రకటించడం విశేషం.
