Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో వ్యతిరేక ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల్లో.. చెరువుకు చెందిన భూములు ఉన్నాయని.. పవన్ ఆక్రమించారని కొందరు ఆరోపించడం ప్రారంభించారు. తెలంగాణలో జనసేన సభ ఏర్పాటు నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడిచింది దీనిపై. దీనిపై న్యాయస్థానం స్పందించింది. తక్షణం ఆ వార్తలతో పాటు వీడియోలను తొలగించాలని సదరు మీడియా సంస్థలను ఆదేశించింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉపశమనం లభించినట్లు అయింది.
* తెలంగాణ వివాదంతో..
మొన్న మధ్యన తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన సభ ఏర్పాటుకు సిద్ధపడగా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఇంకా ప్రాంతీయ వాదంతో ముందుకు వెళుతున్న వారిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. ఆయన భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో కోడి చెరువును ఆక్రమించేసారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను చెరువు భూమిని కబ్జా చేసినట్టు నిరూపిస్తే జన్వాడలోని తన ఇంటిని తానే స్వయంగా తగలబెట్టుకుంటానని తేల్చి చెప్పారు.
* కోర్టు ఆదేశాలు..
ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల విషయంలో తెలంగాణ జనసేన నేతలు పూర్తి ఆధారాలను బయటపెట్టారు. అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు అనుమతులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది రాజకీయ కక్షతో, పవన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశం లో పవన్ కళ్యాణ్ పై నిరాధారమైన సమాచారంతో కూడిన పోస్టులను, వీడియోలను, కంటెంట్ ను తొలగించాలని ఎక్స్ మెటా, గూగుల్ ఇండియా, యూట్యూబ్, గూగుల్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యుఆర్ఎల్ లను బ్లాక్ చేయాలని సూచించింది.
