AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది . ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. వైసిపి ఒంటరి పోరుకు సిద్ధపడగా.. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు జగన్ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం పేరిట జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ సభలు కొనసాగనున్నాయి. అటు పవన్ సైతం రాష్ట్రస్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గ సమీక్షలను పూర్తి చేశారు.
ఫిబ్రవరి 4 నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల వరకు క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ను జనసేన నాయకత్వం రూపొందించే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడంతో పాటు కీలకమైన కొన్ని జిల్లాలను టార్గెట్ చేసుకొని పవన్ ప్రచారం చేయనున్నారు. అక్కడ వారాహి యాత్రతో పాటు కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో పవన్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది ఆ దిశగా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అనకాపల్లి నియోజకవర్గ నుంచి పవన్ పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ప్రాథమికంగా పవన్ పర్యటన ఎక్కువగా ఉంటుందని టాక్ నడుస్తోంది. అవసరాన్ని బట్టి ఈ పర్యటన షెడ్యూల్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ కు సమాంతరంగా జనసేన నాయకులు సైతం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని సమాచారం. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెనర్లను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అటు జగన్, ఇటు చంద్రబాబు, ఇంకో వైపు పవన్ కళ్యాణ్ ల పర్యటనలతో ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొనే అవకాశం ఉంది. పవన్ ఫిబ్రవరి 4 నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టనుండడంతో జనసైనికుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది.