Deputy CM Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎంతో సమన్వయంతో ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై తమదైన ముద్ర చాటుకుంటున్నారు. ప్రభుత్వ పాలనపై చంద్రబాబు పూర్తిగా దృష్టిపెట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కంటే పవన్ ముందు వరుసలో ఉన్నారు. డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు పవన్. దీంతో పవన్ పని తీరుపై అందరిలోనూ అనుమానాలు ఉండేవి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పాలన విషయంలో తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారు పవన్. తొలుత సచివాలయంలోని తన ఛాంబర్ లో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం చేసే పవన్.. క్రమేపి అధికారులతో సమీక్షలు జరపడం, తన శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేయడం విశేషం. ఆ తరువాత మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లాక మరింత దూకుడుగా ముందడుగు వేయడం ప్రారంభించారు.
* శరవేగంగా స్పందిస్తున్న పవన్
అయితే క్షేత్రస్థాయి పర్యటనలు, వైసిపి హయాంలో అక్రమాల విషయంలో పవన్ స్పందన శరవేగంగా ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కంటే పవన్ ఎక్కువగా స్పందిస్తున్నారు. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల విషయంలో అయినా.. ఇప్పుడు వైసీపీ నేత సజ్జల ఫ్యామిలీ భూముల కబ్జా వ్యవహారంలో అయినా పవన్ నిర్ణయాలు చాలా దూకుడుగా ఉన్నాయి. అయితే పవన్ మాదిరిగా దూకుడు నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు వెనుకబడ్డారన్న చర్చ అయితే మాత్రం ఉంది.
* అదంతా వ్యూహాత్మకమే
అయితే ఆ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు దృష్టంతా అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, అభివృద్ధి అంశాలపై ఉంది. ఆపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. నెలవారి పింఛన్ల పంపిణీకి మాత్రం ఏదో జిల్లాకు హాజరవుతున్నారు. మొత్తం క్షేత్రస్థాయి పర్యటనల బాధ్యతను పవన్ కు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. వైసీపీని ఇరుకున పెట్టడంలో కూడా చంద్రబాబు ఎందుకో వెనుకబడి పోతున్నారు. ఈ విషయంలో సైతం పవన్ ముందు వరుసలో ఉంటున్నారు. అయితే పవన్ దూకుడు జనసైనికులు అభిమానాన్ని నింపుతోంది. కానీ అది చంద్రబాబుతో కలిసి చేస్తున్న వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.