AP assembly seats increase details: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఇప్పుడు ఉన్న పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ సీట్లను 50 శాతానికి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలో భారీగా పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వాటి సంఖ్య 263 కు పెరగనుంది. పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి వాటి సంఖ్య 38 కి చేరుకొనుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రాంతాలవారీగా పెరిగే నియోజకవర్గాల పై స్పష్టత వస్తోంది. ఏ పార్టీకి అవకాశం ఉంటుందో అన్న చర్చ నడుస్తోంది.
రాయలసీమలో.. రాయలసీమ( Rayalaseema ) ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. 2014లో ఇక్కడ వైసిపి ఆధిపత్యం కొనసాగింది. 2019లో అయితే మూడు నియోజకవర్గాలు తప్ప 49 సీట్లు వైసిపివే. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పుడు పునర్విభజనతో రాయలసీమలో ఓ 25 స్థానాలు పెరగనున్నాయి. అనంతపురంలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు పునర్విభజనతో 21కి చేరుకొనున్నాయి. కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరులో 14 నుంచి 21, నెల్లూరులో పది నుంచి 15కు, ప్రకాశం లో 12 నుంచి 18 కి అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 74 సీట్లు ఉండగా.. పునర్విభజనతో 37 సీట్లు పెరగనున్నాయి. తద్వారా 111 కు చేరుకొనున్నాయి.
కోస్తాంధ్రలో..
సాధారణంగా తెలుగుదేశం ( Telugu Desam)పార్టీకి గుంటూరు, కృష్ణాజిల్లాలు ఏకపక్షంగా ఉంటాయి. 2014 ఎన్నికల్లో టిడిపికి అనుకూల ఫలితాలు వచ్చాయి. 2019లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పునర్విభజనతో ఈ రెండు జిల్లాల్లో అసెంబ్లీ సీట్లు 49కి పెరగనున్నాయి. గుంటూరులో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 కాగా మరో ఎనిమిది పెరుగుతాయి. కృష్ణాజిల్లాలో సైతం 24 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి మొన్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ జనసేన పట్టు కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో తూర్పుగోదావరిలో ప్రస్తుతం 19 నియోజకవర్గాలు ఉండగా మరో తొమ్మిది పెరగనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం 15 స్థానాలకు గాను మరో ఏడు పెరిగి 22 కు చేరుకోనున్నాయి.
ఉత్తరాంధ్రలో..
ఉత్తరాంధ్రలో( North Andhra ) ప్రస్తుతం టిడిపి కూటమి బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 34 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. ఇప్పుడు పునర్విభజనతో 17 స్థానాలు పెరగనున్నాయి. 51 అసెంబ్లీ సీట్లకు చేరుకోనున్నాయి. ఉమ్మడి విశాఖలో 15 నుంచి 23 కు, విజయనగరంలో పది స్థానాలు 15కు, శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలు 15కు పెరగనున్నాయి. అయితే ఈసారి అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 132 అసెంబ్లీ సీట్లు దాటాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా రావాలి అంటే 26 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది.