Nara Lokesh: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయడంతో ఈ నెలలోనే కొత్త వారి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అభ్యర్థులను రంగంలోకి దిల్చేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో నాలుగు పదవులను దక్కించుకోనుంది. అయితే టిడిపికి రెండు, బిజెపికి ఒకటి, జనసేనకు ఒకటి కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఈసారి టిడిపిలో పోటీ ఉండడంతో మూడు రాజ్యసభ పదవులు ఆ పార్టీ తీసుకుంటుందని.. జనసేనకు ఒకటి కేటాయిస్తుందని.. బిజెపికి ఈసారి ఇచ్చే ఛాన్స్ లేదని ఒక టాక్ ఉంది. అయితే ఈ లెక్కన టిడిపికి రెండు పదవులు దక్కడం ఖాయం. కానీ ఆశావహులు చూస్తే పదుల సంఖ్యలో ఉన్నారు. రాజ్యసభ పదవుల ఎంపిక చంద్రబాబుకు ఇబ్బందికరమే. అయితే ఈసారి సీనియర్లను తప్పించి జూనియర్లకు అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.
* యువతరానికి అవకాశాలు..
ఇటీవల తెలుగుదేశం పార్టీలో యువతరానికి ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. ఆయన టీమ్ లోకి పలువురు యువ నేతలు వచ్చారు. కిలారు రాజేష్ లాంటి వారికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర కార్యవర్గంలో సైతం యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించారు. ఇదంతా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా లోకేష్ టీమ్ లో చేరేందుకు యువ నేతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నేతల వారసులు లోకేష్ తో పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర కార్యవర్గం తో పాటు అన్ని రకాల నియామకాల్లో ఇకనుంచి యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
* సానా సతీష్ కు మరోసారి
తాజాగా రాజ్యసభ పదవులకు సంబంధించి ఇద్దరు యువ నేతలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పదవీ విరమణ చేస్తున్న నలుగురిలో టిడిపికి చెందిన యువ నేత సానా సతీష్ ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆయన రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. తక్కువ కాలం కావడంతో ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. సానా సతీష్ లోకేష్ కు అత్యంత దగ్గరైన వ్యక్తి. 2019 నుంచి 2024 మధ్య తెర వెనుక ఉండి పార్టీకి విశేష సేవలు అందించారు. అందుకే ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో నడిచింది కిలారు రాజేష్, సానా సతీష్. అందుకే కిలారు రాజేష్ కు జాతీయ కార్యవర్గంలో చోటిచ్చారు. ఇప్పుడు సతీష్ కు మరోసారి రాజ్యసభకు అవకాశం కల్పించనున్నారు.
* చింతకాయల విజయ్ కు..
మరోవైపు యువనేత చింతకాయల విజయ్ కు రాజ్యసభ పదవీ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు. గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రి మాదిరిగా దూకుడు కలిగిన నేత. టిడిపి సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరెస్టులకు కూడా భయపడలేదు. బీసీ సామాజిక వర్గం నేత కావడంతో కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో లోకేష్ తో కలిసి నడవాల్సిన నేత కావడంతో ఆయనకు రాజ్యసభ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే లోకేష్ టీం ఇప్పుడు రాజ్యసభ పదవులు దక్కించుకోనుదన్నమాట.
