Nara Lokesh: యువ నాయకుడు లోకేష్( Nara Lokesh) ప్రభావం ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. జాతీయస్థాయిలో కూడా ఆయన పేరు వినిపిస్తోంది. మొన్ననే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. పేరుకే టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. కానీ ఆయనకు మించి అన్నట్టు లోకేష్ వ్యవహారం నడుస్తోంది. ఆయన కనుసన్నల్లోనే పార్టీ ఉంది. పార్టీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పార్టీపై పూర్తి పట్టు సాధించారు లోకేష్. ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో మాస్ లీడర్ గా ఎదగాలని గట్టి ప్రయత్నం లో ఉన్నారట నారా లోకేష్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర చేపట్టారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. ఇప్పుడు మంత్రిగా ఉండడంతో పాటు పార్టీ బాధ్యతలు తీసుకున్న దృష్ట్యా.. మరింత ప్రభావంతమైన నేతగా మారాలన్న ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.
* ప్రారంభంలో ఇబ్బందులు..
లోకేష్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో ఆయన ఒక సాధారణ వ్యక్తి. చంద్రబాబు తనయుడు మాత్రమే. రాజకీయ వారసుడు అనిపించుకోలేకపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. పైగా చంద్రబాబు లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా ఆయనకు పదోన్నతి కల్పించారు. లోకేష్ కెరీర్ కు అది కూడా ఒక రకమైన ఇబ్బందికరమే. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులంతా లోకేష్ ను వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేశారు. నిత్యం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అయితే అన్నింటిని మించి అన్నట్టు రాటు తేలారు నారా లోకేష్. రాజకీయంగా పూర్తిగా పట్టు సాధించారు. వ్యక్తిగతంగా తన శరీర ఆకృతిని మార్చుకున్నారు. పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఇది చాలదు అనేది టిడిపిలో ఉన్న ఒక భావన.
* మాస్ లీడర్ గా ఎదిగేందుకు..
రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఎదిగితేనే నాలుగు కాలాలపాటు గుర్తిస్తారు. అయితే చంద్రబాబు పాలనా థక్షుడు. ఆయన మాస్ లీడర్ కాదు. ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు చివరి దశలో మాత్రం చాలా గౌరవాన్ని దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు మాదిరిగా కాకుండా లోకేష్ ఒక మాస్ లీడర్ గా ఎదగాలి అంటే ప్రజలతో మమేకమై పని చేయాల్సి ఉంటుంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పుడు లోకేష్ ప్రజల మధ్యకు వచ్చేందుకు పక్కాగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. తరచూ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీని అభివృద్ధి చేయడమే కాదు ప్రజల్లో తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారట. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడతారట. చూడాలి మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో..