Nara Brahmani: నందమూరి కుటుంబానికి చెందిన మహిళలు కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే పురందేశ్వరి ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఏపీ బీజేపీ చీఫ్ గా కొనసాగారు. ఇంకోవైపు భువనేశ్వరి సైతం వ్యాపార రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఇప్పుడు సేవా సంస్థల ద్వారా సేవలందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు విస్తృతం చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణి హెరిటేజ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. తాజాగా ఆమె ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో అత్యంత ప్రతిభావంతమైన మహిళా వ్యాపారవేత్త అవార్డును దక్కించుకున్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్య పత్రిక బిజినెస్ టుడే ఈ అవార్డును అందించింది.
* ప్రస్తుతం హెరిటేజ్ ఈడిగా
నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.1989లో హెరిటేజ్ ను స్థాపించారు చంద్రబాబు. అయితే రాజకీయాల్లో బిజీగా మారిన చంద్రబాబు ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరి కి అప్పగించారు. అటు తర్వాత లోకేష్ సైతం కొద్ది రోజులు కంపెనీ కార్యకలాపాల్లో ఉండేవారు. లోకేష్ వివాహం తర్వాత బ్రాహ్మణి ఇప్పుడు ఆ కంపెనీ బాధ్యతలు చూస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ దేశంలోనే అత్యుత్తమ సంస్థగా గుర్తింపు సాధిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.
* ప్రతిభావంతమైన వ్యాపార దిగ్గజంగా..
2025- 26 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన వ్యాపార దిగ్గజంగా నారా బ్రాహ్మణి గుర్తింపు పొందారు. బిజినెస్ టుడే ఏటా ఈ అవార్డులను అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా సుమారు 22 మంది వ్యాపారవేత్త లుగా రాణిస్తున్న మహిళలు పోటీలో పాల్గొన్నారు. వారందరిలో నారా బ్రాహ్మణి అత్యుత్తమ వ్యాపారవేత్తగా నిలిచారు. ముంబైలో ఈ అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారవేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్న బిజినెస్ టుడే పత్రికకు ధన్యవాదాలు తెలిపారు నారా బ్రాహ్మణి. ఆమె ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. వారానికి ఒకరోజును ఆసుపత్రిలో సేవలకు కేటాయిస్తున్నారు.