Nagababu Meets Pawan: ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో.. రాజకీయాలకు సినీ రంగం చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో కూడా చూసాం. ముఖ్యంగా తెలుగు నాట నందమూరి తారక రామారావు రికార్డ్ సృష్టించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రాగలిగారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi). ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి 2009 ఎన్నికల బరిలో నిలిచారు. కానీ నిలబడలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో 18 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ అసాధారణ రీతిలో 70 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన ను ఏర్పాటు చేసి.. పదేళ్లపాటు కష్టపడి.. పార్టీని విజయపథంలో నడిపారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అలా తన సోదరుడుకు ఎదురైన ఓటమి అనుభవాన్ని గుణపాఠంగా మార్చుకొని రాజకీయాల్లో నిలబడగలిగారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మెగా బ్రదర్స్ ముగ్గురు చట్టసభలకు ఎన్నిక కావడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా
మెగాస్టార్ చిరంజీవికి విశేష ప్రేక్షక ఆదరణ ఉండేది. లక్షలాదిమంది అభిమానులు ఆయన సొంతం. అందుకే 2009లో ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీని ఏర్పాటు చేశారు. ఒంటరి పోరాటానికి మొగ్గు చూపారు. నాడు అధికార కాంగ్రెస్ ఒకవైపు.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహాకూటమి మరోవైపు పోటీ చేస్తుండగా.. ప్రజారాజ్యం పార్టీ రూపంలో త్రిముఖ పోటీ నెలకొంది. అటువంటి సమయంలో 18 అసెంబ్లీ సీట్లను తెచ్చుకుంది ప్రజారాజ్యం పార్టీ. 70 లక్షల ఓట్లతో రికార్డు సృష్టించింది. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ కు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. అలా పార్లమెంటులో అడుగుపెట్టగలిగారు మెగాస్టార్ చిరంజీవి.
సుదీర్ఘకాలం తర్వాత పవన్..
2014 ఎన్నికలకు ముందు ఆవిర్భవించింది జనసేన. కానీ ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. అలా రెండుచోట్ల పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎటువంటి నామినేటెడ్ పదవులు తీసుకోలేదు. రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవుల ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. కానీ ఒకే ఒక స్థానానికి పరిమితం అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. కానీ మొక్కవోని దీక్షతో 2019 నుంచి 24 మధ్య గట్టిగానే నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కీలక మంత్రిత్వ శాఖలతోపాటు ఉప ముఖ్యమంత్రి హోదా అందుకున్నారు.
మండలిలో నాగబాబు..
జనసేనలో పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ). 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో పక్కకు తప్పుకున్న నాగబాబు కూటమి విజయానికి ఎన్నికల్లో కృషి చేశారు. అందుకే ఆయనకు అధికారంలోకి రాగానే అనేక పదవుల ఆఫర్లు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మెగా బ్రదర్ నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నాగబాబు. ఈరోజు శాసనమండలి సమావేశాలు కావడంతో తొలిసారిగా మండలి లోకి వచ్చారు. అంతకుముందు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకొని పలు అంశాలపై చర్చించారు. శాసనమండలిలో నాగబాబు రావడం కొత్త చర్చకు దారితీసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొణిదల సోదరులు ముగ్గురు చట్టసభలకు ప్రాతినిధ్యం గొప్ప విషయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతటి చక్కటి అవకాశం పొందిన కుటుంబం లేదని చెబుతున్నారు.