Mudragada Padmanabham: కాపు నాయకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ). ఆ సామాజిక వర్గం నుంచి చాలామంది నేతలు రాజకీయంగా ఎదిగారు. కానీ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టిన ముద్రగడ పద్మనాభంది ఆ సామాజిక వర్గంలో ప్రత్యేక స్థానం. అయితే కాపు ఉద్యమాన్ని చేపట్టిన ఆయన అదే సామాజిక వర్గానికి వ్యతిరేకం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆయన పిలుపును కాపులు పెద్దగా పట్టించుకోలేదు. కూటమితో పాటు జనసేన ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ ఓటమికి ప్రయత్నం చేశారు.. కానీ కనీస స్థాయిలో కూడా ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే వరకు పోరాటం చేస్తానని శపధం చేశారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే రాజకీయంగా అనుకున్న స్థాయిలో ఆయన రాణించలేకపోయారు. ప్రారంభ దశలో ఎంపీగా, మంత్రిగా ఉండేవారు. అటువంటి నేత ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అటు తరువాత కూడా రాజకీయంగా తప్పటడుగులు వేశారు. ఇప్పుడు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కుమారుడికి రాజకీయ అవకాశం కల్పించాలని చూస్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే బాగాలేదు. అందుకే కూటమి పార్టీల వైపు ముద్రగడ చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అప్పట్లో జనసేన వైపు..
వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేనలో( janasena ) చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తనకు గౌరవం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తే చేరుతానని పవన్ కళ్యాణ్ కు సమాచారం ఇచ్చారు. పవన్ సైతం అందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ తర్వాత పవన్ విముఖత చూపడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ముద్రగడ. ఆ బాధతోనే నేరుగా తాడేపల్లి కి వెళ్లి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం ఇచ్చారు జగన్. కానీ ఆ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఆశాజనకంగా లేదు. పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడే అవకాశం లేదని కనిపిస్తోంది. అందుకే ముద్రగడ పద్మనాభం ఆలోచన మారినట్లు సమాచారం. ఇటీవల టిడిపి నాయకులు పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టిడిపికి చెందిన సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కలిశారు. అయితే వీరి భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నా.. దీని వెనుక రాజకీయాలు ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి.
* కుమారుడి కోసం..
ముద్రగడ వయసు పెరుగుతోంది. దాదాపు ఏడు పదుల వయసు ఉంటుంది. ఇటీవల అనారోగ్యానికి కూడా గురయ్యారు. కుమారుడిని రాజకీయంగా సెట్ చేయాలని చూశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉంది. కానీ గెలుపు పైనే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే ముద్రగడ మనసు మార్చుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. టిడిపి హయాంలో ఉద్యమం చేపట్టి వైసీపీకి ప్రయోజనం చేకూర్చారు. అయితే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ముద్రగడ చాలా పొరపాట్లు చేశారన్న విమర్శ ఉంది. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే వరుసగా టిడిపి నేతలు ఆయనను కలుస్తున్నారు. దీంతో ఈ ప్రచారం మరింతగా బలపడుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.