Manugunta Mahidhar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు గుడ్ బై చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపు సిద్ధపడ్డారు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆగ్రహంగా ఉన్నారు. జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో పార్టీని వీటడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. కార్యకర్తలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నైరాస్యం అలముకుంది. ఇప్పుడు మహీధర్ రెడ్డి గుడ్ బై చెబితే మరింత సంక్షోభం ఖాయం ఆ పార్టీకి.
సుదీర్ఘ నేపథ్యం..
మానుగుంట మహిధర్ రెడ్డికి కందుకూరు రాజకీయాల్లో మంచి నేపథ్యం ఉంది. బలమైన క్యాడర్ కూడా ఉంది. మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. 1989లో తొలిసారిగా కందుకూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1994లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి చవి చూశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సైతం విజయాన్ని దక్కించుకున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.. 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
కొంతకాలంగా పార్టీకి దూరం..
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మహిధర్ రెడ్డి దూరంగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. ఇటీవల వరుసగా పార్టీ శ్రేణులతో పాటు అనుచరులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. పసుపు కండువా కప్పుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి.. ఆ తరువాత నెల్లూరు జిల్లాలో విలీనమైన కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ రెడ్డి టిడిపిలో చేరితే ఒక ఊపు రావడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న మహిధర్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడితే కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపడం ఖాయం. మహీధర్ రెడ్డిని పార్టీని వీడకుండా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
