Mamata Banerjee KCR Jagan: దేశంలో దొంగ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. ఇది ఆహ్వానించదగ్గ విషయం. కానీ బిజెపి, ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు దీనిని తప్పు పడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించడమే ఈ ప్రత్యేక ఓటరు సవరణ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపైనే న్యాయ పోరాటం చేస్తున్నారు. స్వయంగా ఆమె వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఓటరు జాబితా సవరణ వెనుక బిజెపికి లబ్ధి ఉందన్నది మమతా బెనర్జీ ఆరోపణ. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ బాటలో నడుస్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఎన్నికల సంఘం చర్యలను అనుమానిస్తారా? అనేది చూడాలి.
స్ట్రాంగ్ గా నిలబడిన మమత..
బెంగాల్లో మమతా బెనర్జీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు. బిజెపికి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓటమి తర్వాత కూడా దీనిపైనే గట్టిగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె ఓటమితో ఈవీఎంలపై అనుమానం కంటే.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణతోనే బిజెపి గెలిచిందని ఆరోపణలు చేశారు. ఒకవైపు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు, ఎమ్మెల్యేలపై ప్రలోభాలు, పార్టీ శ్రేణులపై కేసులు నమోదవుతున్న మమతా బెనర్జీ వెనక్కి తగ్గడం లేదు. బిజెపి పై అదే పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఆ ధైర్యం కేసిఆర్, జగన్ చేయగలరా అనేది ఇప్పుడు ప్రశ్న.
వైసీపీ అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎలానూ ఉంటుంది. ఏపీలో అయితే తమ సానుభూతి ఓట్లు ఎక్కడ అన్న ఆందోళనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొంది. ఆ పార్టీ శ్రేణులతో రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. అటు తెలంగాణలో గులాబీ పార్టీ నుంచి కూడా పెద్దగా కదలికలేదు. అయితే కెసిఆర్ తో పాటు జగన్ మమతా బెనర్జీని అనుసరించి బీజేపీపై పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది. కానీ అంత సాహసం చేసే ఆలోచన ఆ ఇద్దరి నేతలకు లేదు. ఎందుకంటే కేసుల భయం అనేది వారికి వెంటాడుతోంది కాబట్టి.
