Furniture issue : కోడెలకు ఒక న్యాయం.. మీకో న్యాయమా? తెరపైకి ఫర్నిచర్ ఇష్యూ.. లోకేష్ స్ట్రాంగ్ రియాక్షన్!

నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా పనిచేశారు కోడెల శివప్రసాదరావు. కానీ 2019లో టిడిపి ఓడిపోయిన తరువాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. స్పీకర్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ విషయంలో వైసీపీ చేసిన దుష్ప్రచారం తోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు జగన్ కోడెల శివప్రసాద్ మాదిరిగా.. అధికారులకు ఫర్నిచర్ గురించి లేఖ రాయడం విశేషం.

Written By: Dharma, Updated On : October 4, 2024 12:50 pm

Jagan Camp Office Furniture issue

Follow us on

Furniture issue :  ఏపీలో కొత్త రాజకీయ అంశం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత.. ఫర్నిచర్ వ్యవహారం చర్చకు వస్తోంది. టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. జగన్ క్యాంపు కార్యాలయం వినియోగిస్తున్న ఫర్నిచర్ పై వైసీపీ అధికారులకు లేఖ రాసింది. జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ఫర్నిచర్ లో తమ దగ్గర కొంత ఉంచుకునేందుకు అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. మిగతా వాటికి రేటు ఎంత అన్నది చెబితే చెల్లించేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.దీనిపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.’ జగన్ దాదా నలభై మంది దొంగలు రాష్ట్రం పై పడి బందిపోట్లులా దోచేశారు. చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను జనం దించేసినా.. సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడు. అడ్డంగా దొరికిన దొంగ జగన్. తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద్ గారు ఇదే లేఖ రాస్తే.. ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తుకు తెచ్చుకో జగన్ ‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు లోకేష్. దీంతో వైసిపి, టిడిపి మధ్య ఈ అంశం రచ్చకు దారితీస్తోంది.

* ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య
ఏపీలో2014లో అధికారంలోకి వచ్చింది టిడిపి. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ వ్యవహరించారు. 2019లో టిడిపి అధికారం కోల్పోయింది. అప్పటివరకు స్పీకర్ గా ఉన్న శివప్రసాదరావు ఇదే మాదిరిగా జగన్ కు లేఖ రాశారు. ఫర్నిచర్ కు ఎంత చెబితే అంత మొత్తం చెల్లిస్తానని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోలేదు జగన్ సర్కార్. నాడు కోడెల శివప్రసాదరావును దారుణంగా అవమానించారు. ఫర్నిచర్ ఎత్తుకుపోయారంటూ ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలకు మనస్థాపానికి గురై శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారు అన్నది టిడిపి అనుమానం. ఇప్పుడు దానినే గుర్తు చేస్తూ జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు టిడిపి నేతలు.

* తాజా వివాదాల నేపథ్యంలో
ఇటీవల వరుస అంశాలు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అది ఆ పార్టీకి ఒక విధంగా మైనస్ చేసింది. వెంటనే కూతుర్లను తిరుపతికి తీసుకెళ్లిన పవన్ వారితో డిక్లరేషన్ ఇప్పించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఫర్నిచర్ అంశాన్ని తెరపైకి తేవడం విశేషం. జూలైలో రాసిన లేఖ గురించి ఇప్పుడు ప్రస్తావనం తేవడం వెనుక ఏదో ఉందన్న అనుమానం టిడిపి నేతల్లో ఉంది. అందుకే లోకేష్ స్పందించారని తెలుస్తోంది.