Nallari Kiran Kumar Reddy Rajya Sabha: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. జూన్లో దేశవ్యాప్తంగా 70 మందికి పైగా రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఏపీకి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నికకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మూడు నెలల ముందే ఎన్ని కోవాల్సి ఉండడంతో వచ్చే నెలలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ నాలుగు పదవులు కూటమికి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి మరి అవకాశం లేదు. అయితే ఉన్న నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలు సర్దుకోనున్నాయి.
పారిశ్రామిక వర్గాలకు లేనట్టే..
అయితే గతంలో బిజెపి విన్నపం మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక వర్గాల నుంచి పరిమల్ నత్వానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి ఆ చాన్స్ లేదు. బిజెపి సొంత నేతలకు రాజ్యసభ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. అది కూడా ఏపీ నుంచి సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్ననే ఆయన బిజెపి తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. రాజంపేట ఎంపీ సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానం కావడంతో.. ముందస్తు ఒప్పందం మేరకు మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని సమాచారం.
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి( nallari Kiran Kumar Reddy) సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన అకాల మరణంతో 1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు కిరణ్. రాజశేఖర్ రెడ్డి తో తొలుత కొన్ని అంశాల్లో విభేదించారు. కానీ అదే రాజశేఖరరెడ్డికి దగ్గరయ్యారు. అందుకే 2004లో చీఫ్ విప్ పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. 2009లో అయితే ఏకంగా స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో 2010లో ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేశారు. తిరిగి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అదే కాంగ్రెస్ లో కొనసాగి చివరకు మొన్నటి ఎన్నికల ముందు బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఆయన సోదరుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబుతో ఉండే వైరం కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపిక లాంచనమేనని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.