Kodali Nani vs Jagan issue: ఇటీవల రాజకీయాల్లో కొడాలి నాని పెద్దగా కనిపించడం లేదు. కొత్తగా జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదనను కూడా ఆయన సమర్థించలేదు. అయితే కొడాలి నానితో పాటు వైసిపి ప్రముఖ నేతలు జగన్మోహన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తరచు స్టాండ్స్ మారుస్తుండడంపై కొడాలి నాని తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ వైఖరితో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని కొడాలి నాని వంటి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అమరావతి రైతుల ఆగ్రహం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయిందని.. ఇప్పుడు మళ్లీ అదే ధోరణితో వెళ్లడం వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఆ రెండు జిల్లాలపై ప్రభావం..
జగన్ మావిగన్ ప్రతిపాదనతో ఆ రెండు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే కొడాలి నాని లాంటి వ్యక్తులు ఇకనుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఎనలిస్టులు సైతం బాహాటంగానే జగన్ తీరును తప్పు పట్టిన సంగతి తెలిసిందే. కొడాలి నాని వంటి వారి అభిప్రాయం కూడా అదే. అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేశారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త కారిడార్ను రాజధానిగా చూపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన క్షేత్రస్థాయిలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజల్లోకి వెళ్లకపోగా తిరిగి పార్టీని డ్యామేజ్ చేసిందని కొడాలి నాని వంటి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. బలహీన పడిన పార్టీని బలోపేతం చేయాలి తప్ప ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం ఏంటి అని నాని తెగ బాధపడుతున్నారట. ఇలా అయితే గుడివాడ లాంటి నియోజకవర్గం లో కష్టమని భావిస్తున్నారట.
కొద్దిమంది మాటకే విలువ..
కేవలం కొద్ది మంది మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత చర్చలో బయటపడుతోంది. కొడాలి నాని లాంటి నేతలు ఇప్పుడు అధినేత పట్ల పూర్తిగా వ్యతిరేక భావనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అమరావతి సెంటిమెంట్ నడుస్తున్న జిల్లాల్లో తమలాంటి వారి పరిస్థితిని చూడకుండా జగన్ అలా చేయడం ఏమిటనేది కొడాలి నాని నుంచి ఎదురవుతున్న ప్రశ్న. రాజధానుల విషయంలో తరచూ స్టాండ్ మార్చడం వల్ల తమలాంటి వారి రాజకీయ భవిష్యత్తు పతనం అవుతుందని.. అందుకే పార్టీలో క్రియాశీలకం తగ్గించుకోవాలని కొడాలి నాని భావిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మునుపటి మాదిరిగా ఇకనుంచి వైయస్సార్ కాంగ్రెస్లో ఆశించిన స్థాయిలో పని చేయలేనని నాని సంకేతాలు పంపినట్లు సమాచారం. మరి అధినేత జగన్మోహన్ రెడ్డి బుజ్జగిస్తారా? లేకుంటే వదిలేస్తారా? అన్నది చూడాలి.