Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయం కింజరాపు వర్సెస్ ధర్మాన ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధర్మాన.. టిడిపి అధికారంలోకి వస్తే కింజరాపు కుటుంబాల హవా ఉంటుంది. అదే చాలామంది రాజకీయ పార్టీల నేతలకు మింగుడు పడని విషయం. ఇప్పుడు అటువంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ అనైతిక బంధం కొనసాగుతోందని ఆయన చెబుతున్నారు. గత కొద్ది కాలంగా ఇదే విషయాన్ని పదేపదే హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ రెండు కుటుంబాలకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు నేరుగా రాజకీయ ప్రత్యర్థి కింజరాపు ఫ్యామిలీ కాగా.. ఒకే పార్టీలో ప్రత్యర్థులు ధర్మాన సోదరులు. ప్రస్తుతం వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో వైసిపి సస్పెన్షన్ వేటులో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే వైసీపీలో తన సస్పెన్షన్ కు ధర్మాన, కింజరాపు కుటుంబాలే కారణమని కోపంతో రగిలిపోతున్నారు.
* విచిత్ర పరిస్థితి..
అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన మనసునిండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ధర్మాన సోదరులు తనను సస్పెండ్ చేయించారని చెప్పుకొస్తున్నారు. అయినా సరే పార్టీలోకి వస్తానని తేల్చి చెప్తున్నారు. జగన్ మాత్రం ఏం సినిమా హీరో అనుకుంటున్నావా అని వ్యంగ్యంగా అడుగుతున్నారు. అదే సమయంలో కింజరాపు కుటుంబం పై కూడా నోరు పారేసుకుంటున్నారు. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ బాబాయ్ అబ్బాయిలను హెచ్చరిస్తున్నారు. తను చెప్పాలనుకున్నది చెబుతున్న దువ్వాడ శ్రీనివాస్ మాటను ఎవరు వినే పరిస్థితిలో లేరు. జగన్ పై అభిమానం కొండంత ఉంది. కానీ వైసీపీలో చోటు లేదు. ధర్మాన కుటుంబం పార్టీని నాశనం చేసిందని చెబుతున్నారు. కానీ వారు లేకుండా ఇప్పుడు జిల్లాలో పార్టీ లేదు. కింజరాపు ఫ్యామిలీ ఏం చేయలేదని చెబుతున్నారు. కానీ జిల్లాలో ఆ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. అందుకే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కింజరాపు, ధర్మాన కుటుంబం పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
* జగన్ తో పాటు తనదే క్రెడిట్..
శ్రీకాకుళం జిల్లాలో మూలపేట కోర్టు నిర్మాణం దాదాపు చివరి దశకు వచ్చింది. అయితే ఆ పోర్టు తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని వైసిపి, ఇటు టిడిపి క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయి. ధర్మాన సోదరుల నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 30న మూలపేట కోర్టు సందర్శనకు సిద్ధపడింది. దీంతో మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ కు కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ రగిలిపోతూ కనిపించారు దువ్వాడ శ్రీనివాస్. ఆ పోర్టు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదని.. తరువాత తనదేనని చెప్పుకొచ్చారు దువ్వాడ. అయితే దువ్వాడ తాను అభిమానించే జగన్ వద్దకు వెళ్లలేకపోతున్నారు. తాను సాధించానని చెబుతున్న మూలపేట పోర్టును సందర్శించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆ రెండు కుటుంబాలపై పడ్డారు దువ్వాడ. సోషల్ మీడియాలో దీనిపైనే సెటైర్లు పడుతున్నాయి.