YS Viveka Case: వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్

సరిగ్గా గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో ఈ అంశం జగన్ కు కలిసి వచ్చింది. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు జగన్ డిమాండ్ చేశారు.

Written By: Dharma, Updated On : March 1, 2024 10:13 am
Follow us on

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ట్విస్ట్. తండ్రి మృతి పై కుమార్తె సునీత గట్టిగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్ మీట్ ఉంటుంది. తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియాను సైతం ఆహ్వానించారు. తన తండ్రి హత్యకు సంబంధించి కుట్ర దారులు ఎవరు? అన్న అంశంపై కొన్ని కీలక విషయాలను, డాక్యుమెంట్లను ఆమె బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సరిగ్గా గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో ఈ అంశం జగన్ కు కలిసి వచ్చింది. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ సైతం సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదని జగన్ భావించారు. అప్పటినుంచి సునీత న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. ఆమె పిటిషన్ వేయడంతో సిబిఐ దర్యాప్తు కొనసాగింది. అయితే ఈ హత్యలో నిందితులను సీఎం జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అసలు కేసు ముందుకు సాగకపోవడం వెనక రాజకీయ కోణం ఉందన్న కామెంట్స్ ఉన్నాయి. అయినా సరే తన తండ్రిని హత్య చేసిన నిందితులు, కుట్రదారులకు శిక్ష పడాలని సునీత గట్టిగానే పోరాడుతున్నారు. కానీ కుట్ర దారులు ఎవరు ఇంతవరకూ బయటపడలేదు. ఇటీవల ఈ కేసులో చాలా ట్విస్టులు కొనసాగాయి. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు సిబిఐ విచారణ సైతం ఆగిపోయింది.

అయితే తన తండ్రి హత్య కేసులో నిజానిజాలు బయట ప్రపంచానికి తెలియాలని సునీత భావిస్తున్నారు. అందుకే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి కీలక వివరాలు వెల్లడించనున్నారు. ఎన్నికల ముంగిట సునీత ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే విపక్షాలు వివేకానంద రెడ్డి హత్య కేసును టార్గెట్ చేసుకున్నాయి. అటు పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల సైతం సునీత వెనుక ఉన్నారు. త్వరలో సునీత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విచారణలో ప్రభావితం చేస్తున్న వ్యక్తులు, గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న తాత్సారం.. తదితర అంశాలతో సునీత కీలక విషయాలు బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది. సునీత ప్రెస్ మీట్ పై సర్వత్ర చర్చ నడుస్తోంది. సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.