Jnaneshwari Missing Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ అగ్రహారం ప్రాంతంలో తప్పిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు విషయంలో ఇప్పటివరకు పురోగతి లభించలేదు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి.. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు.. అనేక రకాలుగా సెర్చ్ ఆపరేషన్ లు చేశారు. ఆయనప్పటికీ పాప ఆచూకీ లభించలేదు.
జూన్ 6న జ్ఞానేశ్వరి ఇంటి బయట ఆడుకుంటున్నది.. అదే సమయంలో తమ తల్లిదండ్రులు పెంచుకుంటున్న కుక్కతో పాటు ఆమె వెళ్లిపోయింది.. అప్పటినుంచి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు .. అధికారులు వెతుకుతూనే ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లభించకపోవడంతో పోలీసులు అపహరణ (కిడ్నాప్) కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి తో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క అదే రోజు గ్రామంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద తిరుతూ కనిపించినట్టు తెలుస్తోంది. ఆ కుక్క మధ్యాహ్నం సమయంలో ఆందోళనగా తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కుక్క తర్వాత ఎటువైపు వెళ్ళిందో క్లారిటీ లేకుండా పోయింది.
అలా వెళ్లిపోయిన కుక్క మూడు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చింది. అప్పటినుంచి ఆ కుక్క కనిపించిన వారి మీద దాడి చేసింది. వింతగా ప్రవర్తించింది. ఆ కుక్కకు వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసినప్పటికీ.. జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. చివరికి ఆ కుక్క చనిపోయింది. ఇప్పటివరకు పోలీసులు జ్ఞానేశ్వరి కేసులో 6 వేలకు పైగా ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను కూడా ప్రశ్నించే వదిలిపెట్టారు. కొండమీద ఉండే వ్యక్తుల గురించి కూడా విచారించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే దివి పోలవరం, కోటవురట్ల, పిఠాపురం ప్రాంతాలలో గాలింపు చేస్తున్నాయి.. చనిపోయిన ఆ కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. ఆ రిపోర్టు రాకపోవడం పట్ల స్థానికులలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్నారు.
జ్ఞానేశ్వరి కేసులో మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యూస్ కోసం.. లైక్స్ కోసం.. అడ్డగోలు ప్రచారం చేయవద్దని.. తాము పాప కోసం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో చూడాలని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులు సమయమనంతో ఉండాలని.. తమ బాధను అర్థం చేసుకోవాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కాగా, చిన్నారి మిస్సింగ్ కేసులో పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజ్ క్లూ గా దొరికిందని తెలుస్తోంది.. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఉన్న వివరాలను బయట పెట్టకుండా, మీడియాకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నట్టు సమాచారం.
