Homeఆంధ్రప్రదేశ్‌Jagan: పవన్ తో రాజీ.. టార్గెట్ మార్చిన జగన్!

Jagan: పవన్ తో రాజీ.. టార్గెట్ మార్చిన జగన్!

Jagan: జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) విషయంలో పవన్ వైఖరి మారిందా? పవన్ పై విమర్శలు చేటు తెస్తున్నాయని జగన్ భావిస్తున్నారా? వీలైనంతవరకు ఆయన పై దాడి తగ్గించాలని అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడారు. 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ మీట్ లో చంద్రబాబుతో పాటు లోకేష్ తీరుపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ గురించి ప్రస్తావన చేయలేదు. అంటే పవన్ విషయంలో జగన్ వ్యూహం మారినట్లు స్పష్టం అవుతోంది.

* అప్పట్లో లోకేష్ ప్రస్తావన లేదు
ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను ( Pawan Kalyan) టార్గెట్ చేసుకునేవారు. అదే సమయంలో చంద్రబాబుపై సైతం విరుచుకుపడేవారు. కానీ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చేవారు కాదు. లోకేష్ పై ఆరోపణలు చేసి ఆయనను హైలెట్ చేయడం ఎందుకు అని జగన్ అలా ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు రాజకీయంగా వైఖరి మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు వెనుక లోకేష్ హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. రెడ్ బుక్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. తప్పు చేసిన కూటమి నేతలను, తప్పులను సమర్థిస్తున్న అధికారులను తప్పకుండా బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు జగన్. సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకొచ్చి శిక్షిస్తామని చర్చరికలు జారీచేశారు. అయితే 30 నిమిషాలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి పవన్ ప్రస్తావన లేకపోవడం విశేషం.

* వ్యక్తిగత జీవితం పై విమర్శలు
గత కొన్నేళ్ళుగా పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకునేవారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. తరచూ ఆయన వైవాహిక జీవితం పై కూడా మాట్లాడేవారు. పదేపదే వివాహాల ప్రస్తావన తీసుకొచ్చేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత కామెంట్స్ భారీగా ప్రభావం రూపాయి అని విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనలతో పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదని సంకేతాలు ఇస్తే కూటమిలో ఒక రకమైన విభేదాలకు అవకాశం ఉంటుందన్నది కూడా ఒక వ్యూహం. అందుకే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయలేదు.

* జగన్ వైఖరితోనే ఆ ఇద్దరు ఒకటి..
అయితే ఇక్కడ మరో వ్యూహం కూడా ఉంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress party)పార్టీకి బలమైన ప్రత్యర్థి తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీకి జనసేన మిత్రపక్షం. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది. ఆ ఇద్దరూ కలవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా.. పదేపదే ఆరోపణలు చేయడం.. చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా ఇద్దరు ఒకే తాటిపైకి వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం కూడా ఆ ఇద్దరి మధ్య సమన్వయం కొనసాగుతోంది. వారి మధ్య బంధం ఇలానే కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదు. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఇదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular