Jagan Mohan Reddy: అమరావతి రైతులకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరావతి పరిధిలోని ఉండవెల్లి, పెనుమాక రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు తమ భూములు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ఎదుట చెప్పారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని చెప్పుకొచ్చారు. అక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నందున పరిహారం ఎక్కువగా ఇస్తేనే ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జగన్ స్పందించారు. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు వైసిపి అధికార వకీలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ని రంగంలోకి దించుతామని చెప్పారు. అయితే ఇలా చెప్పిన రైతు.. అదే రోజు నేరుగా వెళ్లి అమరావతి భూ సేకరణలో భాగంగా తన భూమిని అప్పగించేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం పోయి ఉండాలి.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు చెప్పిన తర్వాత భయపడి ఉండాలి.
* 27 మంది రైతులు..
ఇటీవల అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఓ 27 మంది రైతులు కలిసిన వారిలో ఉన్నారు. అందులో అశోక్ రెడ్డి అనే రైతు కూడా ఉన్నారు. ఆ గ్రామంలో తాను ఒక్కడినే వైసీపీ సానుభూతిపరుడునని చెప్పుకొచ్చారు. అయితే తమ గ్రామం మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డు వెళుతుందని.. ఆ రోడ్డుకు గాను భూ సమీకరణ చేస్తున్నారని.. కానీ భూముల ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని.. ఇక్కడి ధరలకు అనుగుణంగా పరిహారంతో పాటు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వమంటే ప్రభుత్వం అంగీకరించడం లేదని చెప్పారు. వెంటనే ఈ రైతుకు న్యాయపరమైన సహాయం అందించాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే అశోక్ రెడ్డి అక్కడకు కొద్దిసేపటికి తనకున్న 1.40 ఎకరాల భూమిని అమరావతి అధికారులకు అందించడం విశేషం.
* అనవసర వివాదమని..
జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు కలవడం వాస్తవం. వారంతా వైసిపికి అనుకూలమైన వారు కావడం అంతకంటే నిజం. బలవంతంగా వైసీపీ నేతలు తీసుకెళ్లడం అంతకంటే వాస్తవం. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వారికి ఇబ్బంది తెచ్చిపెట్టి ఉంటాయి. ఏదైనా న్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఉండవచ్చు. కానీ లీగల్ సాయం పేరుతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారిని రంగంలోకి దించితే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వారు గ్రహించినట్టు ఉన్నారు. న్యాయ పోరాటం అంటే వివాదం మరింత ముదరడం ఖాయమన్న వాస్తవాన్ని వారు గుర్తించారు. అందుకే ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు అమరావతి రైతుల విషయంలో చేసిన ప్రయత్నాలు వృధా ప్రయాసగా మిగిలాయి.
